
న్యూఢిల్లీ : స్పైస్ జెట్ సంస్థకు ఏవియేషన్ రెగ్యులేటరీ డీజీసీఏ నోటీసులు జారీ చేసింది. 18 రోజుల వ్యవధిలో 8సార్లు సాంకేతిక లోపాలు తలెత్తడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సురక్షితమైన, సమర్థవంతమైన సేవల్ని అందించడంలో స్పైస్ జెట్ విఫలమైందని డీజీసీఏ అభిప్రాయపడింది. కంపెనీ సర్వీసులు, అంతర్గత రక్షణ, స్పేర్ పార్ట్ ల కొరత తదితర అంశాలను డీజీసీఏ నోటీసులో ప్రస్తావించింది. మంగళవారం చెన్నై నుంచి కోల్ కతా బయలుదేరిన స్పైస్ జెట్ కార్గో విమానం వెదర్ రాడార్ పనిచేయకపోవడంతో వెనక్కి వచ్చింది. పదే పదే ఇలాంటి సమస్యలు తలెత్తుతుండటాన్ని సీరియస్ గా తీసుకున్న డీజీసీఏ స్పెస్ జెట్ కు నోటీసులు ఇచ్చింది.
గత నెల 19 నుంచి స్పైస్జెట్ ఫ్లైట్లల్లో 8సార్లు సాంకేతిక లోపాలు తలెత్తాయి. జూన్ 19న పాట్నా నుంచి 185 మంది ప్రయాణికులతో బయలుదేరిన స్పైస్ జెట్ విమానాన్ని పక్షి ఢీకొట్టడంతో నిమిషాల వ్యవధిలోనే అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అదే రోజు జబల్పూర్- నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానంలో మరో సమస్య తలెత్తింది. గత నెల 24,25 తేదీల్లో రెండు వేర్వేరు విమానాల్లో ఫ్యూజ్లేజ్ డోర్ వార్నింగ్ తలెత్తింది. దీంతో ఆ రెండు విమాన సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. ఈ నెల రెండున జబల్పూర్- నుంచి ఢిల్లీ టేకాఫ్ తీసుకున్న ఫ్లైట్ క్యాబిన్లో పొగలు వచ్చాయి.