ఆధార్ కార్డుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేశంలో బ్యాంక్ అకౌంట్ కావాలన్నా…ప్రభుత్వ స్కీంలు రావాలన్నా…ఎలాంటి సర్టిఫికెట్ అయినా తీసుకోవాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని సర్టిఫికెట్లకు ఆధార్ కార్డు అవసరం తప్పనిసరి కాదని ప్రకటించింది. వాటిలో లేటెస్టుగా బర్త్, డెత్ సర్టిఫికెట్లు కూడా వచ్చి చేరాయి. ఈ సర్టిఫికెట్ల రిజిస్ట్రేషన్కు ఆధార్ అవసరం లేదని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (RGI) ప్రకటించింది.
డెత్ సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డు తప్పనిసరిగా సమర్పించాలా అంటూ విశాఖకు చెందిన అడ్వకేటు ఎంబీఎస్ అనిల్ కుమార్ సమాచార హక్కు చట్టం(RTI) ద్వారా అభ్యర్థించాడు. అతడి అభ్యర్థనకు ఆర్జీఐ స్పందిస్తూ.. జనన, మరణ ద్రువీకరణ కోసం ఆధార్ నెంబర్ అవసరం లేదని తెలపింది. 1969 నాటి రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్(RBD) చట్టం ప్రకారం ప్రస్తుతం జనన, మరణ ద్రువీకరణ కోసం రిజిస్ట్రేషన్ జరుగుతోంది. ఒకవేళ ఎవరైనా ఆధార్ను స్వచ్ఛంధగా సమర్పిస్తే, ఆ డాక్యుమెంట్ను డేటాబేస్లో స్టోర్ చేయరాదని తన సర్క్యూలర్లో తెలిపింది.