
నివాస గుర్తింపు మాత్రమే
తెలంగాణ పోలీసుల రిపోర్ట్ ఆధారంగానే
127 మందికి నోటీసులు
తప్పుడు పత్రాలతో తీసుకుంటే ఆధార్ రద్దు
అక్రమ వలసదారులకు ఆధార్ ఇవ్వొద్దని
సుప్రీం చెప్పింది. వివరణ ఇచ్చిన యూఐడీఏఐ
బాధితుల తరఫున పోరాటం చేస్తామన్న అడ్వొకేట్ జేఏసీ
హైదరాబాద్, వెలుగు: ఆధార్ కార్డు పౌరసత్వానికి ఆధారం కాదని యూఐడీఐ స్పష్టం చేసింది. పౌరసత్వంతో దానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. దేశంలో ఓ వ్యక్తి నివాస ప్రాంతాన్ని ధ్రువీకరించేది మాత్రమేనని పేర్కొంది. తప్పుడు డాక్యుమెంట్లతో ఆధార్ కార్డు పొందారన్న ఆరోపణలతో హైదరాబాద్కు చెందిన 127 మందికి ఆధార్ రీజనల్ ఆఫీస్ నోటీసులు ఇచ్చిందన్న కథనాలపై బుధవారం యూఐడీఏఐ వివరణ ఇచ్చింది. తెలంగాణ పోలీసులు ఇచ్చిన రిపోర్టుల ఆధారంగానే ఒరిజినల్ పత్రాలు చూపించేందుకు గురువారం హాజరవ్వాల్సిందిగా రీజనల్ ఆఫీస్ నోటీసులు ఇచ్చిందని, ఒకవేళ వాళ్లు అక్రమంగా వలస వచ్చిన వాళ్లే అయితే ఆధార్ చట్టం ప్రకారం వాళ్ల ఆధార్ను రద్దు చేయొచ్చని చెప్పింది. అక్రమ వలస దారులకు ఆధార్ ఇవ్వొద్దని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను గుర్తు చేసింది. నోటీసులు అందుకున్నోళ్లు సరైన పత్రాలను చూపించలేకపోయినా, తప్పుడు డాక్యుమెంట్లతో ఆధార్ తీసుకున్నా, ఆ తప్పు తీవ్రతను బట్టి ఆధార్ను సస్పెండ్ చేయడమో లేదా రద్దు చేయడమో జరుగుతుందని పేర్కొంది. ఆధార్ నోటీసులకు, పౌరసత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. ఆధార్ రద్దు చేసినంత మాత్రాన జాతీయత పోదని పేర్కొంది. క్వాలిటీ ఇంప్రూవ్మెంట్లో భాగంగా ఎప్పుడూ తీసుకునే చర్యల్లో భాగమే ఇదని చెప్పింది. హైదరాబాద్ వాళ్లకు ఇచ్చిన నోటీసులూ అలాంటివేనని చెప్పింది.
ఆ హక్కు ఆధార్కు లేదు
ప్రజల పౌరసత్వాన్ని పరిశీలించే అధికారం ఆధార్ సంస్థకు లేదని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. నోటీసులు ఇచ్చిన వాళ్లలో ముస్లింలు, దళితులు ఎంతమందున్నారని ప్రశ్నిస్తూ తెలంగాణ పోలీస్, ఆధార్ సంస్థను ట్యాగ్ చేశారు. రాష్ట్ర డీజీపీ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్డన్ సెర్చ్ చేసే సమయంలో పోలీసులు ఆధార్ కార్డు అడగడం మానేయాలని, వాటిని అడిగే హక్కు, చట్టబద్ధత లేదన్నారు. మైనారిటీలు, దళితులే టార్గెట్గా వేధింపులకు పాల్పడుతున్నారని, అందులో భాగంగానే వారికి నోటీసులు జారీ చేసి అన్ని గుర్తింపు పత్రాలను మళ్లీ పరిశీలిస్తామంటున్నారని మండిపడ్డారు. ఆధార్ సంస్థ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. నోటీసును జారీ చేసిన డిప్యూటీ డైరెక్టర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సీఏఏ, ఎన్నార్సీ కోసం పౌరుల వివరాలు తెలుసుకునే అధికారం ఆధార్ ఎన్రోల్మెంట్ డైరెక్టర్ జనరల్ లేదని అడ్వొకేట్స్ జేఏసీ కన్వీనర్ వలీ ఉర్ రెహమాన్ అన్నారు. భవానీనగర్కు చెందిన ఆటో డ్రైవర్ సత్తార్కు వచ్చిన నోటీసులతో పాటు మరికొంత మందికి వచ్చిన నోటీసుల ఆధారంగా హైకోర్టులో పిటిషన్ వేస్తామని, న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.
ఇదీ జరిగింది
ఫేక్ డాక్యుమెంట్లతో ఆధార్ కార్డు పొందారన్న ఆరోపణలతో ఈ నెల 3న భవానీ నగర్కు చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ సత్తార్ సహా 127 మందికి హైదరాబాద్లోని ఆధార్ రీజనల్ ఆఫీస్ (ఆర్వో) నోటీసులు ఇచ్చింది. ఆర్వో డిప్యూటీ డైరెక్టర్ (ఎంక్వైరీ) అమిత్ బింద్రో నోటీసులు ఇచ్చారు. సరైన డాక్యుమెంట్లు తీసుకుని గురువారం రంగారెడ్డి జిల్లా బాలాపూర్లోని మెగా గార్డెన్స్లో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కాకపోయినా, సరైన డాక్యుమెంట్లు చూపించకపోయినా ఆధార్ను రద్దు చేస్తామని పేర్కొన్నారు.
see also: భారతీయుడు2 షూటింగ్లో ప్రమాదం
రీజినల్ రింగ్ రోడ్డు ఆగింది!
సర్కార్ ఫోకస్ : రిటైర్మెంట్ ఏజ్ 61