- పెండ్లి మొక్కులు తీర్చుకుని వస్తుండగా చెట్టును ఢీకొన్న వ్యాన్
- ఒకే కుటుంబంలో 12 మందికి గాయాలు
మెట్ పల్లి, వెలుగు: పెళ్లి మొక్కులు చెల్లించేందుకు దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదంలో నూతన దంపతులతోపాటు ఒకే కుటుంబానికి చెందిన 12 మందికి గాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లా గూపన్ పల్లికి చెందిన అరుణ్(28)కు నిజామాబాద్ పట్టణం వినాయక్ నగర్ కు చెందిన లక్ష్మీ(23)తో నాలుగు రోజుల క్రితం వివాహం జరిగింది. వివాహం అనంతరం పెళ్లి మొక్కులు చెల్లించేందుకు పుణ్యక్షేత్రాలైన వేములవాడ, కొండగట్టు, ధర్మపురికి నూతన దంపతుల కుటుంబసభ్యులు 12 మంది శనివారం ఓ వ్యాన్ లో బయలుదేరారు. మొక్కులు చెల్లించి మంగళవారం ఉదయం ధర్మపురి నుంచి తిరిగి వస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి శివారులో వ్యాన్ అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. వ్యాన్ ముందు భాగం నుజ్జు నుజ్జవడంతో డ్రైవర్ రవితోపాటు పక్కనే కూర్చున్న కొత్త పెళ్లికొడుకు అరుణ్ వ్యాన్ లో ఇరుక్కుపోయారు. వెనుక కూర్చున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఇనుపరాడ్ల సాయంతో వ్యాన్ రేకులు తొలగించి గాయపడినవారిని దవాఖానకు తరలించారు. డ్రైవర్ రవికి ఓ కాలు, చేయి ఫ్రాక్చర్కాగా అరుణ్ కాలు నుజ్జు నుజ్జయ్యింది. లక్ష్మి కంటికి గాయాలయ్యాయి. అరుణ్, రవిల పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ దవాఖానకు తరలించారు.
For More News..