- నిట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్యామ్
- 8 మొక్కలపై రీసెర్చ్ చేశామని వెల్లడి
- 2 నెలల్లో క్లారిటీ వస్తుందని వివరణ
- గతంలో కరోనా వచ్చినోళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచన
వరంగల్, వెలుగు: గతంలో కరోనా బారిన పడినోళ్లకు ఒమిక్రాన్తో ముప్పు ఎక్కువగా ఉంటుందని వరంగల్ నిట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పెరుగు శ్యామ్ హెచ్చరించారు. వాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. డెల్టా వేరియంట్ హైబ్రిడ్గా మారడంతో వైరస్ స్పీడ్ ఎక్కువగా ఉందని చెప్పారు. దాని ప్రభావం లోపలి అవయవాలపై పడే ప్రమాదం ఉందన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి చెందిన ఆయన కరోనా వైరస్ వేరియంట్లు, వాటి ప్రభావం, ట్రీట్మెంట్ పద్ధతులపై రీసెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒమిక్రాన్ ప్రభావం గురించి ‘వీ6 వెలుగు’తో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఒమిక్రాన్కు ఆయుర్వేద ట్రీట్మెంట్ ఇచ్చేందుకు 8 రకాల మొక్కలపై రీసెర్చ్ చేశామని చెప్పారు. ఒక్కొక్క మొక్క నుంచి తీసిన చూర్ణంతో పాటు.. అన్ని మొక్కల పదార్థాలతో కలిపి తయారు చేసిన చూర్ణాలతో ఒమిక్రాన్పై ప్రయోగించి చూశామని తెలిపారు. ఒకట్రెండు నెలల్లో దీనిపై క్లారిటీ వస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఆక్సిజన్ స్వచ్ఛంగా లేకనే బ్లాక్ ఫంగస్
కరోనా సెకండ్ వేవ్లో డెల్టా వేరియంట్.. లంగ్స్పై తీవ్ర ప్రభావం చూపిందని శ్యామ్ తెలిపారు. దీంతో బాధితులకు ఆక్సిజన్ అవసరం ఎక్కువైందన్నారు. ఆక్సిజన్ స్వచ్ఛత ఆధారంగానే పేషెంట్లు కోలుకున్నారన్నారు. స్వచ్ఛత లేనిచోటే కరోనా పేషెంట్లు బ్లాక్ ఫంగస్, ఎల్లో ఫంగస్ బారిన పడ్డారని చెప్పారు. డెల్టా వేరియంట్లో మార్పులు జరుగుతున్నాయని, అది హైబ్రిడ్గా మరే ప్రమాదముందంటూ ఎనిమిది నెలల కిందటే చెప్పానని గుర్తు చేశారు. ఇప్పుడు ఒమిక్రాన్గా అది రూపం మార్చుకుందని, ఈ వేవ్లో దాని స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు. ఫస్ట్ వేవ్లో మామూలు వైరస్లో జరిగిన మూడు మ్యుటేషన్లు, సెకండ్వేవ్లో జరిగిన 9 మ్యుటేషన్లకే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చూశామని, అలాంటిది 52 మార్పులు జరిగిన ఒమిక్రాన్తో ప్రభావం ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చని హెచ్చరించారు. ఈ నెలాఖరు నాటికి ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతాయని
తెలిపారు.
తీవ్రత ఉండకపోవచ్చు
దేశంలో వాక్సినేషన్లో స్పీడ్ పెంచడం కొంత ఊరటనిచ్చే విషయమని శ్యామ్ చెప్పారు. కేసుల సంఖ్య పెరిగినా.. దాని తీవ్రత ఎక్కువగా ఉండకపోవచ్చని అన్నారు. పండుగలు, ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాలకు దూరంగా ఉండకుంటే కేసులు భారీగా పెరిగే ప్రమాదముందన్నారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. థర్డ్ వేవ్, ఒమిక్రాన్ వేరియంట్, భవిష్యత్తులో వచ్చే వేరియంట్లు, మెడిసిన్ వంటి అంశాలపై పరిశోధనలు చేశామని, ఆ డేటా తయారీ చివరి దశకు వచ్చిందని చెప్పారు. ఇంటర్నేషనల్ జర్నల్స్ పబ్లిష్ అయ్యేంత వరకు దాని మీద ఓ కన్క్లూజన్ ఇవ్వడానికి వీలుంటుందని తెలిపారు.