
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలేవైనా ఏ బడ్జెట్లోనైనా అభివృద్ధి, సంక్షేమం అనే రెండు అంశాలపై ఫోకస్ పెడతాయి. దేశ ఆర్థికాభివృద్ధికి, ప్రభుత్వ ఆర్థిక ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచటానికి ప్రయారిటీ ఇస్తాయి. ద్రవ్య లోటు (ఫిస్కల్ డెఫిసిట్) పెరగకుండా చూసుకుంటాయి. అన్ని వర్గాల ప్రజల్నీ దృష్టిలో పెట్టుకొనే కేటాయింపులు జరుపుతాయి. యూత్కి ఉద్యోగ కల్పన కోసమూ ప్రయత్నాలు చేస్తాయి. కాకపోతే ఆయా చర్యలు ఒక్కోసారి ఫలించవు. ఇలా జరక్కూడదంటే ఈసారి మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్ని (తయారీ రంగాన్ని) ఎంకరేజ్ చేయాలంటున్నారు.
ఈ రంగమే ఎందుకు?
ఎకానమీలో అతి పెద్ద సెక్టార్లుగా అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్లను చెప్పుకోవచ్చు. వ్యవసాయ రంగం దేశంలోని మొత్తం వర్క్ఫోర్స్లో దాదాపు సగానికి ఉపాధి చూపుతోంది. కానీ, ఈ సెక్టార్లో గ్రోత్ అంతగా ఉండదు. వానలు సకాలంలో రాకపోవటం, ప్రతి సంవత్సరం క్రమంతప్పకుండా పంటలు పండకపోవటం దీనికి కారణాలు. పంట పండినా సరైన రేట్లు ఉండకపోవటం మరో కారణం. అందువల్ల ఏటా లక్షల సంఖ్యలో పెరుగుతున్న వర్క్ఫోర్స్కి ఈ రంగంలో పని దొరకట్లేదు. దీంతో వాళ్లంతా వేరే సెక్టార్ల వైపు వెళ్లిపోతున్నారు. దాదాపు పాతికేళ్ల నుంచీ ఇదే పరిస్థితి.
సర్వీస్ సెక్టార్ వేగంగా అభివృద్ధి చెందేదే అయినా అక్కడ ఉద్యోగం కోరుకునేవారి సంఖ్య భారీగా ఉంటుంది. ఆ రంగంలో నిలదొక్కుకోవాలంటే చదువుతోపాటు స్కిల్స్ కూడా ఉండాలి. పల్లెల నుంచి వచ్చే గ్రాడ్యుయేట్లు ఈ విషయంలో సిటీ స్టూడెంట్స్తో పోటీపడలేకపోతున్నారు. ఇక మిగిలింది ఇండస్ట్రీ ఒక్కటే. ఇందులో రెండు సబ్ సెక్టార్లు ఉన్నాయి. ఒకటి.. మాన్యుఫ్యాక్చరింగ్. రెండు.. నాన్–మాన్యుఫ్యాక్చరింగ్. రెండో కేటగిరీలోకి కన్స్ట్రక్షన్, మైనింగ్ వంటివి వస్తాయి. అందుకే అందరి చూపూ పారిశ్రామిక రంగంపైనే ఉంటోంది.
ఎంప్లాయ్మెంట్కి ఎక్కువ అవకాశాలు
తయారీ రంగంలో ఏటా జరిగే అభివృద్ధికి తగ్గట్లే అదనపు ఉద్యోగాలకూ అవకాశం ఉంటుంది. దీన్నే ‘ఎంప్లాయ్మెంట్ ఎలాస్టిసిటీ’ అంటారు. మాన్యుఫ్యాక్షరింగ్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ ఎలాస్టిసిటీ ఎక్కువని రీసెర్చ్లో కూడా తేలింది. యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు రెండూ ఈ రంగానికి బూస్టింగ్ ఇచ్చాయి. 2011లో యూపీఏ గవర్నమెంట్ ‘న్యూ నేషనల్ మాన్యుఫ్యాక్షరింగ్ పాలసీ’ని తెచ్చింది. జీడీపీలో ఈ రంగం వాటాను 2022 నాటికి 25 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
మోడీ సర్కారు కూడా దేశీయ తయారీ రంగానికి పెద్ద పీట వేసింది. యూత్కి లక్షల సంఖ్యలో జాబులు రావటానికి మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టారే మెయిన్ ప్లాట్ఫామ్ అని తీర్మానించుకుంది. ఈ రంగాన్ని ప్రోత్సహించటానికి ‘మేకిన్ ఇండియా’ ప్రాజెక్టును ప్రారంభించింది. పెద్ద, చిన్న పరిశ్రమలన్నింటినీ ప్రమోట్ చేసే చర్యలు చేపట్టింది. మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్కి గడచిన పదేళ్లుగా ఊతమిస్తున్నా ఆశించిన ఫలితాలు రావట్లేదు. జీడీపీలో తయారీ రంగం వాటా 17 శాతం లోపే ఉంటోంది. కొత్త ఉద్యోగాల కల్పన పెద్ద సంఖ్యలో అయితే సాధ్యం కావట్లేదు.
ఎందుకిలా?
మాన్యుఫ్యాక్చరింగ్కి ప్రభుత్వం ఎంత సపోర్టివ్గా ఉంటున్నా జాబులు మాత్రం అందుబాటులోకి రావట్లేదు. ఆర్గనైజ్డ్ సెక్టార్లోని ఇండస్ట్రీలు కార్మికులకు ఇచ్చే వేతనాలను భారంగా భావిస్తుండటమే దీనికి కారణం. కేపిటల్–టు–లేబర్ రేషియో పెరుగుతుండటంతో యాజమాన్యాలు వర్కర్ల సంఖ్యను పెంచటానికి బదులు పెట్టుబడి పెంపు పైనే దృష్టి పెడుతున్నాయి. మనుషుల ప్లేస్లో మెషీన్లను ప్రవేశపెడుతున్నారు. ఇలాంటి చర్యల వల్ల లాభాలు రాకపోయినా కంపెనీల ఓనర్లు ఇదే ట్రెండ్ని కొనసాగిస్తున్నారు.
మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఒక్కో యూనిట్పై పెడుతున్న పెట్టుబడితో పోల్చితే వస్తున్న రాబడి బాగా తగ్గుతున్నట్లు 2007–08 నుంచి 2017–18 వరకు సేకరించిన డేటాను బట్టి తెలుస్తోంది. అదే సమయంలో ఎంప్లాయ్స్ శాలరీస్ తగ్గినట్లుగా మాన్యుఫాక్చరింగ్ సెక్టార్పై స్టడీ చేసిన ఇండియా రేటింగ్స్ అనే సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు దొరికే టెక్స్టైల్స్, లెదర్ ఇండస్ట్రీల్లో ఇదే ట్రెండ్ కొనసాగినట్లు చెప్పింది.