కటక్(ఒడిశా): దేశ ప్రజలకు, ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా చట్టాలను మార్చాలని సుప్రీంకోర్టు చీఫ్జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. ప్రస్తుత చట్టాలను చట్టసభలు మళ్లీ పరిశీలించాలని.. చట్టాలు ప్రాక్టికల్ గా, వాస్తవాలకు దగ్గరగా ఉండేలా రిఫామ్స్ తేవాలన్నారు. శనివారం కటక్ లో ఒడిశా స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ కొత్త బిల్డింగ్ ను ప్రారంభించిన అనంతరం సీజేఐ రమణ మాట్లాడారు. రాజ్యాంగ ఆకాంక్షలను నెరవేర్చుకునే దిశగా ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ వ్యవస్థలు ఒకదానితో ఒకటి కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయ వ్యవస్థ ఆధ్వర్యంలో వచ్చే వారం దేశవ్యాప్తంగా భారీ ఎత్తున లీగల్ అవేర్ నెస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దేశ న్యాయ వ్యవస్థకు ప్రధానంగా రెండు సవాళ్లు ఉన్నాయన్నారు. ఒకటి న్యాయ వ్యవస్థను ఇండియనైజేషన్ చేయడం, రెండోది న్యాయ వ్యవస్థపై ప్రజలకు అవగాహన కల్పించడమని చెప్పారు.
స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు అయినా, ఇప్పటికీ సామాన్యులు కోర్టుకు వెళ్లేందుకు వెనకాడుతున్నారని సీజేఐ రమణ చెప్పారు. కోర్టుల పద్ధతులు, భాష, రూల్స్ వాళ్లకు పరాయి విషయాలుగా కన్పిస్తున్నాయన్నారు. క్లిష్టమైన భాష, ప్రొసీజర్లతో జనం నమ్మకం కోల్పోతున్నారని అన్నారు. సామాన్యులకు వేగంగా న్యాయం జరగాలని, ఈ దిశగా లీగల్ సర్వీసెస్ అథారిటీల పాత్ర కీలకమని అన్నారు. లోక్ అదాలత్, మీడియేషన్స్ వంటి వాటి ద్వారా కేసులు త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు.