
అడుగు ముందుకు పడ్తలె
కొన్ని నెలలుగా ఫ్లై ఓవర్ల నిర్మాణ పనులు
వాటి కారణంగా రోడ్డు డ్యామేజ్
జనాల హెల్త్ కరాబు… యాక్సిడెంట్లు
హైదరాబాద్, వెలుగు: సిటీలో ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ లేకుండా చేసేందుకు నిర్మిస్తున్న ఫ్లై ఓవర్స్ పనులతో వెహికల్స్ జామ్ అవుతోంది. నిర్మాణాలను త్వరగా కంప్లీట్చేయాల్సి ఉండగా అధికారులు ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. లాక్ డౌన్ టైమ్ లో కొంచెం స్పీడ్ గా పనిచేసినట్లు చేసి మళ్లీ ఎక్కడికక్కడే వదిలేశారు. వీటి కోసం తవ్విన గుంతలు, ప్రత్యామ్నాయ రోడ్ల కారణంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. అయినా బల్దియా అధికారులు వీటి పట్టించుకోవడం లేదు. నెలలుగా ఎక్కడి పనులు అక్కడే వదిలేశారు. బహదూర్ పురాలో కడుతున్న ఫ్లై ఓవర్ కారణంగా కిలోమీటర్ కు పైగా రోడ్డు డ్యామేజ్ అయ్యింది. ఇక్కడ గత నెల రోజుల్లో 10 యాక్సిడెంట్లు అయ్యాయి. చాలా మంది గుంతల కారణంగా బ్యాక్ పెయిన్, వెన్నెముక ప్రాబ్లమ్స్తో బాధపడుతూ హాస్పిటల్స్ కు వెళ్తున్నారు.
లాక్ డౌన్ తర్వాత పనులు స్టార్ట్ కాలే
సిటీలో పదుల సంఖ్య లో ఫ్లై ఓవర్ల నిర్మాణాలను స్టార్ట్ చేసిన సర్కార్ వాటిపై దృష్టి పెట్టడం లేదు. నాగోల్, సంతోష్నగర్ ఓవైసీ, బహదూర్ పురా, బాలానగర్, బైరామల్ గూడ, షేక్ పేట్, గచ్చిబౌలి ప్రధాన ఫ్లై ఓవర్లు నిర్మాణంలో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో కొద్ది నెలలుగా పనులు ఆగిపోయాయి. బహదూర్ పురా ఫ్లై ఓవర్ పనులను లాక్ డౌన్ తర్వాత స్టార్ట్ చేయలేదు. ఇక్కడ ఫ్లై ఓవర్ పూర్తైతే గానీ రోడ్డు వేయలేని పరిస్థితి ఉంది. దీంతో అటు ఫ్లై ఓవర్ లేక ఇటు రోడ్డు డ్యామేజ్ తో వాహనదారులు, జనాలు చుక్కలు చూస్తున్నారు. గతేడాది నవంబర్ లోనే అందుబాటులోకి తెస్తామన్న బాలానగర్ ఫ్లై ఓవర్ పనులు కూడా ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. సంతోష్నగర్ ఓవైసీ, నాగోల్ ఫ్లై ఓవర్ల పనులు పెండింగ్ పడ్డాయి. బైరామల్ గూడ ఫ్లై ఓవర్ ఓ వైపు పూర్తి కాగా మరో వైపు పనులు చేయాల్సి ఉంది. ఇప్పటికీ స్లోగా పనులు చేస్తుండగా ఎప్పటికీ పూర్తయి అందుబాటులోకి వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది.
యాక్సిడెంట్లు, ట్రాఫిక్ జామ్ లు
నిర్మాణంలో ఉన్న అన్ని ఫ్లై ఓవర్ల వద్ద యాక్సిడెంట్లు, ట్రాఫిక్ జామ్ లు అవుతున్నాయి. మెటీరియల్ ను రోడ్డు పక్కనే వేయడం, ఫ్లై ఓవర్ల కోసం తవ్విన గుంతలతో ట్రాఫిక్ నెమ్మదిగా ఉంటోంది. నాగోల్, షేక్ పేట్, బాలానగర్ లో చాలా సేపు ట్రాఫిక్లో జనం ఇబ్బంది పడుతున్నారు. రోడ్డంతా గుంతలు పడడంతో వాహనాదారులు మెల్లగా వెళ్తున్నారు. ఇక ఫ్లై ఓవర్ల వద్ద ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంట లేరు. ట్రాఫిక్ టైమ్ లోనే క్రేన్ల ద్వారా పైకి సామగ్రి తీసుకెళ్తున్నారు. ఏ మాత్రం పొరపాటు జరిగినా భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఫ్లై ఓవర్ల పై వెల్డింగ్ చేస్తున్న సమయంలో కింద వాహనాలు వెళ్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
ఇంకెప్పుడూ కంప్లీట్ చేస్తరు ?
ఫ్లై ఓవర్ల నిర్మాణం లేటు అవుతుండడంతో ఇబ్బందులు పడుతున్నం. బహదూర్పురా, ఓవైసీ, నాగోల్ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రయాణిస్తా. గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుపోతున్నా. వీలైనంత త్వరగా ఫ్లై ఓవర్ల నిర్మాణాలు కంప్లీట్చేయాలి.
– సునీల్, చాంద్రాయణగుట్ట