
- రూల్స్ను, మా ఆదేశాలనూ పట్టించుకోలేదు
- భవిష్యత్ ముఖ్యమే కానీ గతం కూడా అవసరమే
- సర్కారు నిర్ణయం ఏకపక్షంగా ఉందని కామెంట్
- ఈ తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అన్న ప్రతిపక్షాలు
ఎర్రమంజిల్లోని భవనాలను కూల్చి కొత్త అసెంబ్లీని కట్టాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సోమవారం హైకోర్టు కొట్టివేస్తూ కీలక తీర్పు వెలువరించింది. కేబినెట్ నిర్ణయం చట్టపరిధిలో లేదని, ప్రత్యక్షంగా చేయలేని దాన్ని పరోక్షంగా చేసే ప్రయత్నం ఇందులో కనిపించిందని ఘాటుగా వ్యాఖ్యానించింది. సకల సౌకర్యాలతో కూడిన అసెంబ్లీ కోసం హెరిటేజ్ భవనాల్ని కూల్చేస్తే ప్రజల చిరకాల చారిత్రక సంస్కృతులు భూస్థాపితం అవుతాయని పేర్కొంది.
కొత్త అసెంబ్లీపై నిర్ణయంలో కీలక రూల్స్ను, ప్రొసీజర్ను, హైకోర్టు ఆదేశాలను సర్కారు పట్టించు కోలేదు. అందువల్ల ఈ నిర్ణయం ఏకపక్షం (ఆర్బిట్రరీ). 2019 జూన్ 18న రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం చట్టపరంగా నిలబడదు. అందుకే దాన్ని పక్కనబెడుతున్నాం.
హైదరాబాద్, వెలుగు: కొత్త అసెంబ్లీ నిర్మాణం కోసం ఎర్రమంజిల్ భవనాలను కూల్చొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. వారసత్వ భవనాల విషయంలో మార్పులు చేర్పులు చేయాలంటే జోనల్ రెగ్యులే షన్-1981లోని 13(2) నిబంధనను కచ్చితంగా అమలు చేయాల్సి ఉందని, అయితే ఎర్రమంజిల్ విషయంలో ఆ నిబంధనను అమలు చేయకుండా జూన్ 18న రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని మండిపడింది. విధాన నిర్ణయాలపై న్యాయ సమీక్షకు ఆస్కారం తక్కువగా ఉన్నప్పటికీ చట్టాలకు లోబడి కేబినెట్ నిర్ణయం లేనందున జోక్యం చేసుకోవాల్సివస్తోందని పేర్కొంది. ఏదైనా నగర గుర్తింపు, చరిత్ర, గతం గురించి చెప్పేవి వారసత్వ భవనాలేనని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎర్రమంజిల్ భవనాలను కూల్చి కొత్త అసెంబ్లీని కట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలు సంస్థలు పిటిషన్లు దాఖలు చేయగా వీటన్నింటినీ కలిపి హైకోర్టు ఉమ్మడిగా విచారించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జడ్జి జస్టిస్ షమీమ్ అక్తర్తో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం సాయంత్రం 111 పేజీల తీర్పు వెలువరించింది. హెరిటేజ్ భవనాల విషయంలో 2016 ఏప్రిల్ 18న తాము ఇచ్చిన మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని పేర్కొంది. కేబినెట్ నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేసింది.
ఎర్రమంజిల్ వారసత్వ భవనమే
ఎర్రమంజిల్లోని భవనం 150 ఏండ్ల నాటిదని, ఈ భవనాన్ని కూల్చి అసెంబ్లీ భవనాల సముదాయాన్ని నిర్మించాలనుకోవడం కుదరదని హైకోర్టు పేర్కొంది. ‘‘వారసత్వ, సాంస్కృతిక సంపదను హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ రూల్స్లో చేర్చాక వాటిని సవరించాలంటే చట్ట ప్రకారం చేయాల్సిందే. పాత చట్టం కింద ఒక నిబంధన చేరాక ఆ చట్టం రద్దయినా ఆ నిబంధన కొనసాగుతుంది. మాస్టర్ ప్లాన్కు స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. రెగ్యులేషన్ 13ను మాస్టర్ ప్లాన్లో చేర్చారు. హెరిటేజ్ కన్సర్వేటివ్ కమిటీ ఒకసారి జాబితాలో మాస్టర్ ప్లాన్ చేర్చాక అందులోని వాటిని తొలగించాలన్నా, కొత్తగా చేర్చాలన్నా హెచ్ఎండీఏ చట్టంలోని సెక్షన్ 15 ప్రకారం చేయాలి. గతంలోని అర్బన్ ఏరియా డెవలప్మెంట్ యాక్ట్ ప్రకారం కమిటీ సిఫార్సుల్ని అమలు చేయాలో లేదో అనే విచక్షణాధికారం హెచ్ఎండీఏ వైస్ చైర్మన్కు ఉండేది. ఇప్పుడా అధికారం చట్టంలో లేదు. హెరిటేజ్ కన్సర్వేటివ్ కమిటీని ఏర్పాటు చేయాలని స్వయంగా హైకోర్టు 2015లో ఆదేశించినా ప్రభుత్వం చేయలేదు. రెగ్యులేషన్ 13ను చట్టంలో తొలగించినా హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్లో కొనసాగుతున్నందున ఎర్రమంజిల్ భవనం వారసత్వ భవనమే అవుతుంది” అని స్పష్టం చేసింది. 2010 నాటిదే కాకుండా 2013 నాటి ప్రస్తుత మాస్టర్ ప్లాన్లో కూడా ఎర్రమంజిల్ హెరిటేజ్ భవనాల జాబితాలోనే ఉందని, హెచ్ఎండీఏ సెక్షన్ 18 ప్రకారం దాని భూమిపై అన్ని విధాల అభివృద్ధి అధికారాలు హెచ్ఎండీఏకే ఉన్నాయని పేర్కొంది. ‘‘మాస్టర్ ప్లాన్లో మార్పులు చేయాల్సివస్తే.. సెక్షన్ 15 (3) ప్రకారం జరగాలి. స్థానికంగా రెండు దినపత్రికల్లో ప్రచురించి ప్రజాభిప్రాయాల్ని తెలుసుకోవాలి. హెచ్ఎండీఏ యాక్ట్లోని 18ని ప్రభుత్వం ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. అర్బన్ ఏరియాస్ యాక్ట్లోని 59 సెక్షన్కు అనుగుణంగానే జోనల్ రెగ్యులేషన్ 13ను తీసుకొచ్చినా దీనినీ ప్రభుత్వం విస్మరించింది” అని డివిజన్ బెంచ్ తెలిపింది. వారసత్వ భవనాల రక్షణకు రాజ్యాంగంలోని 21వ అధికరణం అండగా నిలుస్తుందని, 1972లో ప్రపంచదేశాల మధ్య జరిగిన ఒడంబడిక ప్రకారం వాటి రక్షణ బాధ్యత, వారసత్వ వైభవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది.
ఇవీ దాఖలైన పిల్స్…
ఎర్రమంజిల్ కట్టడాలను కూల్చడాన్ని వ్యతిరేకిస్తూ ఎర్రమంజిల్ ప్యాలెస్ నిర్మాత నవాజ్ ఫక్రుల్ ముల్క్ వారసుడు డాక్టర్ మిర్ ఆస్గార్ హుస్సేన్, డెక్కన్ ఆర్కియాలజికల్ అండ్ కల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధి కె.జితేంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన పిల్స్ను కోర్టు ఆమోదిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. ఇదే అంశంపై ఓయూ స్కాలర్ శంకర్, సామాజిక కార్యకర్తలు ఓఎం దేబ్రా, డాక్టర్ లుబ్నా సార్వత్, రిటైర్డు ప్రొఫెసర్ విశ్వేశ్వర్రావు, జిందాబాద్ హైదరాబాద్ సంస్థ ప్రతినిధి పి.యాదగిరి, ఇతరులు దాఖలు చేసిన పిల్స్ను పాక్షికంగా ఆమోదించింది. మంత్రివర్గం నిర్ణయాన్ని సవాల్ చేయడాన్ని సమర్థిస్తున్నట్లు డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది. ఈ పిల్స్ జులై 3 నుంచి పలు దఫాలుగా వాదనలు సాగాయి.
వీగిపోయిన సర్కార్ వాదన
ఎర్రమంజిల్ బిల్డింగ్ కూల్చివేతను సమర్థిస్తూ ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ జె.రామచందర్రావు చేసిన వాదన వీగిపోయింది. ఎర్రమంజిల్ను హెరిటేజ్ భవనం జాబితా నుంచి తప్పించామని, కేబినెట్ తీసుకున్న విధానా నిర్ణయాల్లో జోక్యం చేసుకోరాదని అదనపు ఏజీ వాదన చేయగా.. దాన్ని హైకోర్టు తోసిపుచ్చింది. ప్రభుత్వం ఉదహరించిన సుప్రీంకోర్టు తీర్పులు ఈ కేసులో వర్తించవని స్పష్టం చేసింది. హెరిటేజ్ భవనాన్ని కూల్చొద్దని పిటిషనర్ల తరఫున సీనియర్ లాయర్ప్రకాష్రెడ్డి, లాయర్ నళినీకుమార్ వాదనల్ని హైకోర్టు ఆమోదించింది.
నగరం గుర్తింపును, సంస్కృతిని చాటిచెప్పే వారసత్వ భవనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వారసత్వ భవనాలను ధ్వంసం చేయడం ప్రజల గుర్తింపును వారి నుంచి దోచుకోవడం అవుతుంది. ఇది సిటీకి ఉండే తనదైన ప్రత్యేకతను (యునీక్ నెస్) దూరం చేస్తుంది. ఈ విషయాలను ప్రభుత్వం మరిచిపోవడానికి వీలులేదు. భవిష్యత్ కోసం ప్లాన్ చేయడం ఎంత ముఖ్యమో, గతాన్ని కాపాడి, సంరక్షించి, నిలబెట్టుకోవడం అంతే అవసరం. – హైకోర్టు
ప్రజల డబ్బును ప్రభుత్వం దుబారా చేయొద్దు. పార్లమెంట్ బిల్డింగ్ ఎంత గట్టిగా ఉందో, అసెంబ్లీ బిల్డింగ్ కూడా అంతే గట్టిగా ఉంది. రాష్ట్రం ఇప్పటికే అప్పుల్లో ఉంది. ఇప్పుడు కొత్త అసెంబ్లీ, సెక్రటేరియెట్ కట్టే పేరుతో మరింత వృథా చేయొద్దు. ఇప్పుడున్న అసెంబ్లీ, సెక్రటేరియెట్లనే కొనసాగించాలి. మేం చెప్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. – ఉత్తమ్కుమార్రెడ్డి, ఎంపీ, పీసీసీ చీఫ్
రూ.5 వేల కోట్ల విలువైన భవనాలను కూల్చి, వందల కోట్లతో కొత్తవి నిర్మించాల్సిన అవసరం లేదని మేం మొదటి నుంచి చెప్తున్నాం. అయినా వినకుండా కేసీఆర్ తానే ఒక నిజాంను, మహారాజును అని అనుకుంటున్నారు. ఒంటెత్తు పోకడలతో, నియంతృత్వంగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు కనువిప్పు కావాలి. – కె.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఎర్రమంజిల్ ప్యాలెస్ను కూల్చి,కొత్త అసెంబ్లీ కట్టొద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపదెబ్బ. ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేయడాన్ని స్వాగతిస్తున్నం. సెక్రటేరియెట్ కూల్చివేత విషయంలోనూ ప్రభుత్వానికి త్వరలోనే ఎదురుదెబ్బ తగలడం ఖాయం. – జి.వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ.