డ్రైవర్ నిర్లక్ష్యం.. బాలుడు మృతి : స్కూల్ నుండి వస్తుండగా ప్రమాదం

డ్రైవర్ నిర్లక్ష్యం.. బాలుడు మృతి : స్కూల్ నుండి వస్తుండగా ప్రమాదం

హైదరాబాద్ : డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా 12 ఏళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన హైదరాబాద్ లో జరిగింది. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని.. మచ్చ బొల్లారం డివిజన్, గోపాల్ రావు నగర్ ఎరుకల బస్తీలో నివసించే శేఖర్, రేణుక దంపతుల కొడుకు రామ్ చరణ్(12).. మచ్చ బొల్లారంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న తన అక్కను తీసుకువచ్చేందుకు వెళ్ళాడు. స్కూల్ నుండి అక్కను తీసుకుని తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో వెనక నుండి లోడ్ తో వచ్చిన బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో రామ్ చరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కొడుకు చనిపోయిన విషయం తెలియడంతో కుటుంబ సభ్యులందరూ కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడు ప్రస్తుతం 6వ తరగతి చదువుతున్నాడని తెలిపిన పోలీసులు.. బొలెరో వాహనం డ్రైవర్ పరారీలో ఉన్నాడన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే తమ కొడుకు చనిపోయాడని ఆరోపిస్తున్నారు బాలుడి తల్లిదండ్రులు.