వాళ్లతో ప్రచారం వద్దు: ఈసీ

వాళ్లతో ప్రచారం వద్దు: ఈసీ

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ ఎంపీ పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మలకు ఎలక్షన్​ కమిషన్​షాక్ ఇచ్చింది. ఢిల్లీ అసెంబ్లీ  ఎన్నికల్లో   వీళ్లద్దర్నీ స్టార్ క్యాంపెయినర్ల  లిస్ట్​ నుంచి వెంటనే తొలగించాలని బీజేపీని ఈసీ  బుధవారం ఆదేశించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈ ఇద్దరు నేతలు కాంట్రవర్షియల్​ కామెంట్స్​ చేసిన నేపథ్యంలో ఎలక్షన్​ కమిషన్​ వారిపై  యాక్షన్​ తీసుకుంది. ‘దేశద్రోహులను కాల్చి చంపండి’ అంటూ ఈనెల 27న ఢిల్లీ ప్రచారసభలో  కేంద్రమంత్రి ఠాకూర్ రెచ్చగొట్టేలా నినాదాలిచ్చినట్టు ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్  ఈసీకి ఇచ్చిన రిపోర్ట్​లో చెప్పారు.  దీనిపై ఠాకూర్‌‌‌‌కు  ఎలక్షన్​ కమిషన్ షోకాజ్ నోటీసు ఇచ్చింది. ఈనెల 30వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని  ఆదేశించింది. బీజేపీ ఎంపీ పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ  కూడా ఎన్నికల ప్రచారంలో వివాదాస్పదమైన కామెంట్స్​ చేశారు.  ‘‘లక్షలాది మంది ప్రజలు అక్కడ (షహీన్ బాగ్)లో గుమిగూడారు. వాళ్లు మీ ఇళ్లల్లోకి చొరబడొచ్చు.  మీ అక్కాచెల్లెళ్లు, కూతుళ్లపై అత్యాచారాలు, హత్యలు చేయొచ్చు. ఇవాళ మీకు  టైం ఉంది. మోడీ కానీ, అమిత్‌‌‌‌షా కానీ మిమ్మల్ని  రేపు కాపాడలేకపోవచ్చు’’ అంటూ  పర్వేష్​ రెచ్చగొట్టేలా కామెంట్​ చేశారు.  ఈ కామెంట్స్​పై తీవ్ర దుమారం రేగింది.

కేజ్రీవాల్​ ఓ టెర్రరిస్ట్​:  మళ్లీ నోరుజారిన పర్వేష్

షహీన్ బాగ్ లో  కామెంట్స్​చేసి  అడ్డంగా బుక్​ అయిన  బీజేపీ ఎంపీ పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ.. లేటెస్ట్​గా మరో కాంట్రవర్షియల్​ కామెంట్ చేశారు. ఈసారి ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్​ను టార్గెట్​ చేశారు. బుధవారం ఢిల్లీ ప్రచార సభలో మాట్లాడిన ఆయన..  కేజ్రీవాల్​ను టెర్రరిస్టుతో పోల్చారు.

అమిత్​ షా ప్రచారంపై బ్యాన్‌‌కు ఆప్​ విజ్ఞప్తి

కేంద్రమంత్రి అమిత్​షా ప్రచారంపై 48 గంటలపాటు బ్యాన్​ పెట్టాలని  ఆమ్​ఆద్మీ పార్టీ  ఎలక్షన్​ కమిషన్​ను కోరింది.  ఢిల్లీ స్కూల్స్​పై  కేంద్ర హోంమంత్రి తప్పుడు వీడియోలు పోస్ట్​చేశారని ఆప్​ ఆరోపించింది.  ఢిల్లీలోని చాలా స్కూల్స్​ “దారుణమైన కండిషన్​”ఉన్నాయని తమపార్టీ  ఎంపీలు గుర్తించారంటూ అమిత్ షా మంగళవారం ట్వీట్​ చేశారు.ఈమేరకు ఫుటేజీని కూడా కేంద్రమంత్రి  పోస్ట్​చేశారు.  దీనిపై రియాక్ట్​ అయిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్​…  మూసి ఉన్న స్కూల్స్​ను బీజేపీ  వీడియో తీసిందని ఆరోపించారు.