పాలమూరులో.. ఫిల్టర్ ఇసుక మాఫియా

పాలమూరులో.. ఫిల్టర్ ఇసుక మాఫియా
  • వర్షాలకు ఉధృతంగా పారుతున్న వాగులు
  • రెండు వారాలుగా ఇసుక లేక నిర్మాణాదారులకు ఇబ్బందులు
  • పొలిటికల్​ లీడర్ల అండతో గ్రామాల పొంటి కృత్రిమ ఇసుక తయారీ
  • గొండ్యాలలో ట్రాక్టర్​ డ్రైవర్లు, ​ లీడర్ల మధ్య డబ్బుల పంచాయితీ!

మహబూబ్​నగర్/మహబూబ్​నగర్​ రూరల్, వెలుగు: రెండు వారాలుగా పాలమూరు జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో ఊకచెట్టవాగు, దుందుభి వాగులకు భారీగా వరద వస్తుండడంతో ఉధృతంగా పారుతున్నాయి. దీంతో ఈ వాగుల్లో ఇసుక తీసేందుకు ‘మన ఊరు–-మన ఇసుక’ ఆన్​లైన్​ సైట్​ ద్వారా ప్రభుత్వం పర్మిషన్లు ఇవ్వడం తాత్కాలికంగా బంద్​ చేసింది. 

ఈ క్రమంలో ఇసుకకు డిమాండ్​ ఏర్పడింది. ఈ డిమాండ్​ను క్యాష్​ చేసుకునేందుకు  కొందరు అక్రమార్కులు ఫిల్టర్​ ఇసుక దందాకు తెరలేపారు. జిల్లా స్థాయిలో ఉండే రాజకీయ నాయకుల పలుబడిని ఉపయోగించుకొని గ్రామ స్థాయి లీడర్లు ఈ దందా నిర్వహిస్తున్నారు. 

ఇందిరమ్మ ఇండ్లకు ఫిల్టర్​ ఇసుక..

మహబూబ్​నగర్​ రూరల్​ మండలంలోని అడవి వెంకటాపూర్, రామచంద్రాపూరం, కోటకద్ర, కోడూరు.. హన్వాడ మండలంలోని  గొండ్యాల్, మునిమోక్షం, వేపూరు,  నవాబుపేట మండలం చౌటపల్లి, ఇప్పటూరు, మల్లారెడ్డిపల్లి, కారూరు గ్రామాల శివారులో ఫిల్టర్​ ఇసుక వ్యాపారం నడుస్తోంది. ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు స్పీడ్​గా జరుగుతున్నాయి. ఈ క్రమంలో లబ్ధిదారులకు ఇసుక అవసరం అవుతోంది. వాగు ఇసుక అందుబాటులో లేకపోవడంతో కొందరు మధ్యవర్తుల సాయంతో ఫిల్టర్​ ఇసుకను కొంటున్నారు. 

ఈ ఇసుక నాసిరకమని తెలిసినా.. తక్కువ రేటుకు వస్తుండడంతో లబ్ధిదారులు కూడా దీనినే కొంటున్నట్లు తెలిసింది. మహబూబ్​నగర్​ రూరల్​ మండలంలో గతంలో  దొంగచాటుగా ఫిల్టర్​ ఇసుక దందా నడువగా.. ఇప్పుడు బహిరంగంగా రోడ్డు పక్కనే ఫిల్టర్​ ఇసుక డంపులు వేసుకుని దందా సాగిస్తున్నారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో తయారు చేసిన ఫిల్టర్​ ఇసుకను వివిధ ప్రాంతాల్లో డంప్​ చేస్తున్నారు. ఆ తరువాత ఆ ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం.

గొండ్యాల్​లో గొడవ..

హన్వాడ మండలం గొండ్యాల్​లో ఇసుక మాఫియా, ట్రాక్టర్  డ్రైవర్ల మధ్య ఇటీవల గొడవ జరిగినట్లు తెలిసింది. ఈ దందాలో ప్రమేయం ఉన్న కొందరు లీడర్లు ఫిల్టర్​ ఇసుక కోసం లబ్ధిదారుల నుంచి ముందుగానే ఒక ట్రిప్పు కోసం రూ.4,5‌‌‌‌‌‌‌‌00 నుంచి రూ.5 వేల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. కానీ, ఈ ఇసుకను లబ్ధిదారుడికి చేర్చిన తర్వాత ట్రాక్టర్​ ఓనర్లకు ట్రిప్పునకు రూ.1,300 ‌‌‌‌‌‌‌‌చెల్లించాల్సి ఉంది. కొద్ది రోజులుగా ఈ డబ్బును లీడర్లు ట్రాక్టర్​ ఓనర్లకు ఇవ్వకపోడంతో వారి మధ్య వివాదం నడుస్తోంది. 

ఐదు రోజులు కింద వారి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. ఈ విషయం బయటకు వస్తే పొలిటికల్​గా డ్యామేజీ​అవుతామనే భయంతో లీడర్లు జాగ్రత్త పడినట్లు తెలిసింది. కానీ, ట్రాక్టర్​ ఓనర్లు మాత్రం డబ్బులు ఇవ్వకుంటే పోలీస్​ స్టేషన్​కు కూడా వెళ్తామని, లేదంటే ఆందోళనలు చేస్తామని వార్నింగ్​ ఇచ్చినట్లు 
తెలిసింది. 

ఆగమైన మీనాంభరం..

నవాబుపేట మండలంలో మీనాంభరం వాగు ఆగమైంది. ఈ వాగు పొంటి ఉన్న వ్యవసాయ భూములను ఫిల్టర్​ ఇసుక మాఫియా లీజుకు తీసుకొని దందా కొనసాగిస్తోంది. మరికొందరు ఏకంగా ఈ భూములనే కొనుగోలు చేస్తూ యథేచ్ఛగా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అయితే ఫిల్టర్​ ఇసుక కోసం మీనాంభరం వాగులో తవ్వకాలు చేపట్టడంతో ఎక్కడికక్కడ వాగు ఆనవాళ్లు కోల్పోయింది. ఎగుడుదిగుడుగా మారడంతో వర్షాలు వచ్చినా వరద ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు హైవేకు ఈ వాగు దగ్గరగా ఉండడంతో ఫిల్టర్​ ఇసుక వ్యాపారం సాఫీగా సాగుతున్నట్లు తెలిసింది. అలాగే మహబూబ్​నగర్​ నుంచి ప్రతి రోజూ రాత్రి పది బెంజ్​ లారీల్లో ఫిల్టర్​ ఇసుకను నింపుకొని పోతున్నట్లు సమాచారం.

మా దృష్టికి రాలేదు..

మహబూబ్​నగర్​ రూరల్​ మండలంలో ఫిల్టర్​ ఇసుక దందా నడుస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. ఇటీవల అడవి వెంకటాపురం గ్రామంలో ఫిల్టర్​ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్​ను పట్టుకొని సీజ్​ చేశాం. ఫిల్టర్​ ఇసుక తయారు చేస్తున్నట్లు కంప్లైంట్లు వస్తే యాక్షన్​ తీసుకుంటాం. ఇరిగేషన్  డిపార్ట్​మెంట్​తో సమన్వయం చేసుకొని చర్యలు తీసుకుంటాం.- శ్రీనివాస్, తహసీల్దార్, మహబూబ్​రూరల్​