మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ(సోమవారం,ఆగస్టు-31) తుదిశ్వాస విడిశారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ప్రణబ్… ఆగస్టు 10న ఆస్పత్రిలో చేరారు. చికిత్సలో భాగంగా మెదడుకు సర్జరీ చేశారు డాక్టర్లు. ఆస్పత్రిలోనే ఆయన కరోనా బారిన పడ్డారు. కరోనాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో గతకొంత కాలంగా ఆస్పత్రిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో ఆరోగ్యం విషమించి మృతిచెందారు.
ఈ విషయాన్ని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆయన మృతిపట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాష్ట్రపతిగా, కేంద్రమంత్రిగా, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ప్రణబ్ భారత రాజకీయాల్లో తనదైన గుర్తింపు పొందారు.
ప్రణబ్ ముఖర్జీ 1935 డిసెంబర్ 11న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బీర్బూమ్ జిల్లాలో ఉన్న మిరాఠి గ్రామంలో జన్మించారు. ఎంఏ(చరిత్ర), ఎంఏ(రాజనీతిశాస్త్రం), ఎల్ఎల్బీ, డీ.లిట్ (విద్యాసాగర్ కాలేజీ) విద్యార్హతలు సంపాదించారు. చదువు పూర్తయిన తర్వాత కొంతకాలం టీచర్, జర్నలిస్టుగా కూడా పనిచేశారు.
1969లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నిక…ఆ తర్వాత 2012లో దేశ 13వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు