ఉలన్ ఉడె(రష్యా) : కొత్త నీరు ఎంత వచ్చినా ఇండియాలో బాక్సింగ్ అనగానే గుర్తొచ్చే పేరు మేరీ కోమ్. టోర్నమెంట్ ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా ఆమెనే టైటిల్ ఫేవరెట్. రష్యా వేదికగా గురువారం ప్రారంభమయ్యే వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్లో మేరీనే ఇండియా పతక ఆశలను మోస్తోంది. కెరీర్లో ఏడో వరల్డ్ టైటిల్పై కన్నేసిన మెగ్నిఫిసెంట్ మేరీ సహా మొత్తం పది మంది బాక్సర్లు ఈ సారి తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. మెగా ఈవెంట్లో మూడో సీడ్ దక్కించుకున్న మేరీ నేరుగా ప్రి క్వార్టర్ఫైనల్కు అర్హత సాధించగా, మరో ఐదుగురు బాక్సర్లకు ఫస్ట్ రౌండ్లో బై లభించింది. 2002లో జరిగిన టోర్నీలో 45 కేజీల విభాగంలో తొలి వరల్డ్ టైటిల్ గెలిచిన మేరీ గతేడాది సొంతగడ్డపై జరిగిన పోటీల్లో 48 కేజీల విభాగంలో గోల్డ్ సొంతం చేసుకుంది. ఓవరాల్గా ఆరు వరల్డ్ టైటిల్స్ గెలిచిన మేరీ ఒలింపిక్స్ దృష్ట్యా 51కేజీలకు మారింది.
ఈ విభాగంలో ఒలింపిక్స్తోపాటు, ఏషియన్ గేమ్స్లో మెడల్స్ సాధించిన ఈ మణిపురి బాక్సర్ మిగిలిన వరల్డ్ టైటిల్ కూడా సాధించాలని పట్టుదలగా ఉంది. ఈ కేటగిరీలో వరల్డ్ చాంపియన్షిప్ కోసం ట్రయల్స్ ఏర్పాటు చేసి చివరి నిమిషంలో హైదరాబాదీ నిఖత్ జరీన్ను అవమానకర రీతిలో తప్పించిన అసోసియేషన్ పెద్దలు 36 ఏళ్ల మేరీని నేరుగా రష్యా పంపారు. మరి మేరీ అంచనాలను అందుకుంటుందా, గోల్డ్ మెడల్ గెలిచి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందో లేదా తెలియాలంటే మంగళవారం జరిగే ప్రిక్వార్టర్స్ బౌట్ దాకా ఓపిక పట్టాల్సిందే. మేరీ తర్వాత ఈ టోర్నీలో ఎల్.సరితాదేవి(60 కేజీ)పై అందరి దృష్టి ఉంది. గత ఎడిషన్ కాంస్య పతక విజేత సిమ్రన్జిత్ కౌర్ను సరిత ట్రయల్స్లో ఓడించడంతో ఆమెపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి.
అంతేకాక తొలిసారి మెగాఈవెంట్ బరిలోకి దిగుతున్న ఇండియా ఓపెన్ గోల్డ్ మెడల్ విజేతలు నీరజ్ ఫొగట్(57 కేజీ), జమున బొరొ(54 కేజీ)తోపాటు 2014 ఎడిషన్ సిల్వర్ మెడలిస్ట్ సవీటి బూర(75కేజీ)పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. మేరీ 51 కేజీలకు మారడంతో 48 కేజీల విభాగంలో మంజు రాణి ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తోంది. 2006లో ఢిల్లీ వేదికగా జరిగిన వరల్డ్ చాంపియన్షిప్లో ఇండియా అత్యధికంగా ఎనిమిది మెడల్స్ గెలిచింది. గతేడాది టోర్నీలో ఇండియా నాలుగు మెడల్స్ సాధించింది. అయితే ఈసారి తమ జట్టు బాగుందని, కొత్త బాక్సర్లు ఎంత దూరం వెళతారో చూడాల్సి ఉందని ఇండియా కోచ్ మహ్మద్ అలీ కమర్ తెలిపాడు.
ఇండియా జట్టు : మంజు రాణి(48 కేజీ), మేరీ కోమ్(51 కేజీ), జమున(54కేజీ), నీరజ్(57 కేజీ), సరిత(60కేజీ), మంజు బొంబొరియా(64 కేజీ), లవ్లీనా(69 కేజీ), సవీటి (75కేజీ), నందిని(81కేజీ), కవిత (81 ప్లస్ కేజీ).