
హైదరాబాద్, వెలుగు:
గాంధీ హాస్పిటల్లో ఇంటర్న్షిప్ అక్రమాలు నిజమేనని తెలుస్తోంది. గతేడాది కొంతమంది విద్యార్థులకు ఇంటర్న్షిప్ పూర్తి చేయకుండానే సర్టిఫికెట్లు ఇచ్చినట్టు కీలక ఆధారాలు ‘వెలుగు’లోకి వచ్చినయి. గుంటూరులోని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివిన ఆరుగురు విద్యార్థులకు, గాంధీలో ఇంటర్న్షిప్ చేసేందుకు 2018లో మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అనుమతించారు. 2019 మార్చి చివరినాటికే వీళ్లు ఇంటర్న్షిప్ పూర్తిచేయాల్సి ఉన్నప్పటికీ, ఆగస్టు నాటికీ కంప్లీట్ చేయలేదు. జూనియర్ డాక్టర్లకు గాంధీ సూపరింటెండెంట్ శ్రావణ్కుమార్ రాసిన ఓ లేఖతో ఈ విషయం బయటపడింది. కానీ, ఈ ఏడుగురిలో కొంతమంది ఏప్రిల్, మేలో జరిగిన నీట్ పీజీ కౌన్సిలింగ్లో పాల్గొని సీట్లు పొందారు. వాస్తవానికి ఇంటర్న్షిప్ సర్టిఫికెట్ లేకుండా పీజీ కౌన్సిలింగ్లో పాల్గొనడం కుదరదు. జూడాలకు సూపరింటెండెంట్ రాసిన లేఖలో వాస్తవం లేదని, సదరు విద్యార్థులకు సర్టిఫికెట్ల జారీలో అక్రమాలు జరిగాయని దీంతో స్పష్టమవుతోంది.
అసలేం జరిగింది..
ఎంబీబీఎస్ అనంతరం ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం 9 నెలల పాటు ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. ఈ టైంలో రకరకాల వార్డుల్లో పనిచేయాలి. అయితే, చాలామంది ఇంటర్న్షిప్ డ్యూటీలకు డుమ్మా కొడుతున్నారు. నీట్ పీజీ కోసం కోచింగ్ సెంటర్లలో చేరుతున్నారు. అటెండెన్స్ కోసం ప్రొఫెసర్ల దగ్గర్నుంచి సూపరింటెండెంట్ దాకా అందరినీ మనీతో మేనేజ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నయి. ఈ నేపథ్యంలోనే గతేడాది ఇంటర్న్షిప్ స్టూడెంట్లకు బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకొచ్చారు. మధ్యలో సుమారు 3 నెలల పాటు గాంధీలో ఈ మెషీన్లు పనిచేయలేదు. హాజరు తక్కువుందనే కారణంతో కొంతమంది స్టూడెంట్స్కు ఇంటర్న్షిప్ ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అయితే, తాము సక్రమంగా డ్యూటీలకు హాజరైనా.. బయోమెట్రిక్ సాకుతో ఎక్స్టెన్షన్ ఇచ్చారని, అసలు డ్యూటీలకు హాజరవనోళ్లకు మాత్రం సర్టిఫికెట్లు ఇచ్చారని స్టూడెంట్లు ఆందోళనకు దిగారు.
సీన్లోకి జూడాలు
స్టూడెంట్స్ ఆరోపణల నేపథ్యంలో జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ సీన్లోకి ఎంటరైంది. ఇంటర్న్షిప్ అవతవకలపై ఎంక్వైరీ చేసి, ఏడుగురు స్టూడెంట్లకు డ్యూటీలకు హాజరవకుండానే సర్టిఫికెట్లు ఇచ్చినట్టు తేల్చింది. దీనిపై సూపరింటెండెంట్ను జూడాలు నిలదీశారు. ఆగస్టు 24న శ్రావణ్ కుమార్కు లేఖ రాశారు. అయితే, తాను వాళ్లకు సర్టిఫికెట్లు ఇవ్వలేదని, అసలు వాళ్లు ఇంటర్న్షిప్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకోనేలేదని ఆగస్టు 28న శ్రావణ్ కుమార్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. సర్టిఫికెట్లు లేకుండా వాళ్లు పీజీలో ఎట్లా జాయిన్ అయ్యారని జూడాలు ప్రశ్నిస్తే, ఎంక్వైరీ జరిపిస్తామని చెప్పి ముగించారు. ‘డాక్టర్ శ్రావణ్కుమారే వాళ్లకు సర్టిఫికెట్లు ఇచ్చారు. నాచారం ఈఎస్ఐలో పనిచేసే ఇద్దరు డాక్టర్లు సూపరింటెండెంట్కు, స్టూడెంట్లకు మధ్యవర్తిత్వం చేశారు. ఈ విషయం తెలిసినా స్టూడెంట్ల పేరెంట్స్ వచ్చి ప్రాధేయపడడంతో జూడాలు ఇష్యూను అక్కడితో వదిలేశారు’ అని ఓ డాక్టర్ ‘వెలుగు’కు వివరించారు.