
హైదరాబాద్, వెలుగు: ఎక్కడైనా స్థానిక సంస్థల ఎన్నికలు క్యాండిడేట్ కేంద్రంగా సాగుతాయి. పార్టీల కంటే అభ్యర్థుల నడవడిక, వారితో ఉన్న పరిచయాలను చూసే జనాలు.. ఓటు ఎవరికేయాలో డిసైడ్ చేసుకుంటారు. కానీ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఇందుకు భిన్నంగా జరిగాయి. సగానికిపైగా జనం అసలు ఓటు వేయకపోగా, ఓటు వేసిన వారిలో చాలా మందికి తమ డివిజన్లో పోటీ చేస్తున్న క్యాండిడేట్ ఎవరో కూడా తెలియలేదు. తాము కేవలం పార్టీల గుర్తులు చూసే ఓటేసినట్టు చాలా మంది ఓటర్లు తెలిపారు. అత్యంత తక్కువ సమయంలోనే పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా రూపొందించిన హడావుడి ఎన్నికల షెడ్యూలే ఇందుకు కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికల షెడ్యూల్కు, పోలింగ్ కు మధ్య 13 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో సగం మంది ఓటర్లను కూడా క్యాండిడేట్లు రీచ్ కాలేకపోయారు. గ్రేటర్లోని ఒక్కో డివిజన్లో సగటున 49,781 మంది చొప్పున, మొత్తం 150 డివిజన్లలో 74,67,256 మంది ఓటర్లు ఉన్నరు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గడువులో ఓటర్లను రీచ్ కావాలంటే.. క్యాండిడేట్లు రోజుకు కనీసం 4 వేల మందిని కలవాల్సి ఉంటుంది. ఏ రకంగా చూసినా.. ఇది సాధ్యమయ్యే పని కాదు. దీంతో రోడ్షోలు, ర్యాలీలకే అభ్యర్థులు పరిమితమయ్యారు. దీంతో సహజంగానే తమ పనుల్లో బిజీగా ఉండే గ్రేటర్ వాసులు, తమ డివిజన్ అభ్యర్థులు ఎవరన్న విషయాన్ని పెద్దగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. కేవలం మీడియా, సోషల్ మీడియాలో పార్టీల ప్రచారాన్ని చూసి మాత్రమే ఓటేసినట్టు చాలా మంది చెప్పుకొచ్చారు.