చేనేత కార్మికులను ఆదుకోవాలంటూ హైకోర్టులో విచారణ

చేనేత కార్మికులను ఆదుకోవాలంటూ హైకోర్టులో విచారణ

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని దాఖ‌లైన పిల్ పై హైకోర్టు సోమ‌వారం విచార‌ణ చేప‌ట్టింది. హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ ధాఖలు చేసిన ఈ పిల్ ను… హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేప‌ట్టింది. సీనియర్ కౌన్సిల్ మాచర్ల రంగయ్య పిటీషనర్ తరపు వాదనలు వినిపించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7 లక్షల మంది చేనేత కార్మికుల గత మూడు నెలలుగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని, 200 కోట్ల చేనేత ముడి సరుకు కార్మికుల వద్ద సిద్దంగా ఉంద‌ని , ఆ స‌రుకును మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేయాలని పిటిష‌నర్ కోర్టుకు తెలిపారు. లాక్ డౌన్ సమయంలో ఉపాధి లేని చేనేత కార్మికులకు నెలకు 30 వేల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని, చనిపోయిన చేనేత కార్మికులకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని పిటిష‌నర్ కోరారు.

హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ పిల్ పై కౌంటర్ ధాఖలు చేసింది. లాక్‌డౌన్ సమయంలో చేనేత కార్మికులకు ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా? ఇచ్చే ఆలోచన ఏమైనా ఉందా? అని ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్ర‌శ్నించింది‌.

చేనేత కార్మికులకు సంబంధించి ప్ర‌భుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదని సీనియర్ కౌన్సిల్ రంగయ్య కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం ఏ విధమైన ఆర్థిక సహాయం చేయలేదన్నారు . లాక్‌డౌన్ నుంచి ఈ రోజు వరకు రాష్ట్రంలో ఏ ఒక్క చేనేత కార్మికునికీ ఆర్ధిక సహాయం అంద‌లేద‌న్నారు. అందరికిచ్చినట్లు బియ్యం, 1500 రూపాయలే ఇచ్చారని కోర్టుకు తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం టెక్సటైల్ డిపార్ట్మెంట్ ఒక సర్కులర్ జారీ చేసిందని, తయారైన మొత్తం సరుకు 45 రోజులలో కొంటామని ప్రభుత్వం హామీ ఇచిందన్నారు. ప్రభుత్వం కౌంటర్ లో పేర్కొన్న అంశాలన్నీ తప్పులతో కూడుకుందని రంగయ్య కోర్టుకు తెలిపారు.

ప్రభుత్వం ధాఖలు చేసిన కౌంటర్ పై రీప్లై కౌంటర్ వేస్తామన‌డంతో.. 10 రోజుల్లో పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని పిటీషనర్ కు హైకోర్టు అదేశమిచ్చింది. తదుపరి విచారణను జులై 2 కు వాయిదా వేసింది.