
మార్కెట్లకు వస్తున్న మొదటి కోత పంట.. రేటు మరింత పెరిగే చాన్స్
హైదరాబాద్, వెలుగు: మిర్చి పంటకు ఈసారి మంచి గిరాకీ లభిస్తోంది. దిగుబడి తక్కువగా ఉండటంతో డిమాండ్ పెరిగింది. ఇప్పుడిప్పుడే మొదటి కోత మార్కెట్లకు వస్తోంది. వరంగల్, ఖమ్మం, మలక్పేట్ మార్కెట్లలో కొత్త మిర్చికి మంచి ధర లభిస్తోంది. సాధారణంగా పాత మిర్చికి మంచి ధర ఉంటుంది. గురువారం ఖమ్మం మార్కెట్కు 862 క్వింటాళ్ల మిర్చి వచ్చింది. మలక్పేట్, వరంగల్ మార్కెట్లకు ఐదు వందల క్వింటాళ్ల వరకు వచ్చింది. మొత్తంగా రాష్ట్రంలోని మార్కెట్లకు 2,156 క్వింటాళ్ల మిర్చి వచ్చింది. వరంగల్ మార్కెట్లో యుఎస్–341 రకానికి హైరేట్ దక్కింది. క్వింటాల్ రూ. 19,500, అదే మార్కెట్లో వండర్ హాట్ రకం క్వింటాల్కు రూ. 18,100 ధర పలికింది. మలక్పేట్ మహబూబ్ మాన్షన్ మార్కెట్లో నంబర్ వన్ మిర్చి క్వింటాల్కు రూ. 16,500 ధర వచ్చింది. ఖమ్మం మార్కెట్లో తేజ రకం క్వింటాల్కు రూ.15 వేలకు అమ్ముడుపోయింది. ఈసారి తాలు మిరపకాయలకు కూడా గిరాకీ బాగానే ఉంది. గురువారం వరంగల్ ఎనుమాముల మార్కెట్లో తాలు మిర్చి క్వింటాల్ రూ. 6,500కు అమ్ముడుపోయింది. గత ఏడాది అత్యధికంగా తాలు మిర్చి క్వింటాల్ రూ. 10 వేలు పలికింది. ఈసారి క్వింటాల్కు రూ. 10 వేలు కూడా దాటిపోయే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
మరింత పెరిగే అవకాశం
ఈసారి మిరప సాగు ఎక్కువగా చేపట్టినా వర్షాల ఎఫెక్ట్తో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. రాష్ట్రంలో మిరప సాధారణ సాగు 1.98 లక్షల ఎకరాలు కాగా.. ఈసారి 2.50 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఎక్కువగా ఖమ్మం జిల్లాలో 55,983 ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 45,464 ఎకరాలు, భూపాలపల్లి జిల్లాలో 18,454 ఎకరాలు, వరంగల్ రూరల్లో 13,472 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 12,418 ఎకరాలు సాగు చేశారు. పంట దిగుబడి 4.16 లక్షల టన్నులు రావొచ్చని అంచనా వేశారు. కానీ, అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. లాస్ట్ ఇయర్ 3.70 లక్షల టన్నుల దిగుబడి రాగా.. ఈసారి 3 లక్షల టన్నులు కూడా వచ్చే పరిస్థితి లేదని హార్టికల్చర్ వర్గాలు చెప్తున్నాయి. దిగుబడి తగ్గడంతో డిమాండ్ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. లాస్ట్ ఇయర్ రూ. 22,500 వరకు ధర పలుకగా ఈఏడాది రికార్డులు తిరగరాసే అవకాశం లేక పోలేదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నారు.