కరోనా కేసులు పెరుగుతున్నా, వివిధ రాష్ట్రాలు రిస్ట్రిక్షన్లు పెడుతున్నా ఉద్యోగుల నియామకాలను అనుకున్నట్టుగానే చేపట్టాలని ఇండియన్ కంపెనీలు చూస్తున్నాయి. ముందు వేసుకున్న ప్లాన్స్ను కొనసాగించాలని అనుకుంటున్నాయి. హైరింగ్ యాక్టివిటీ షార్ట్ టెర్మ్ ప్రాసెస్ కాదని, ఒక వేళ అడ్డంకులున్నా అది తాత్కాలికమేనని మెజార్టీ కంపెనీలు అంటుండడం విశేషం. కన్సల్టెన్సీ కంపెనీ టీమ్లీజ్ చేసిన సర్వే ప్రకారం మెజార్టీ కంపెనీలు ఉద్యోగులను నియమించుకోవడానికే ఇష్టపడుతున్నాయి. ఎకానమీ రికవరీ అవుతుందనే ఆశలతో పాటు, వ్యాక్సినేషన్ ప్రాసెస్ స్టార్టవ్వడంతో కరోనా కట్టడి చేయగలమని నమ్ముతున్నాయి. కిందటేడాదిలా కాకుండా ఈ సారి కంపెనీలు కూడా పెరుగుతున్న కరోనా రెస్ట్రిక్షన్లకు ముందుగానే రెడీగా ఉన్నాయి. ‘వివిధ సెక్టార్లలోనే కంపెనీలు హైరింగ్ను చేపట్టాలని చూస్తున్నాయి’ అని టీమ్లీజ్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ రితుపర్న చక్రవర్తి అన్నారు. టీమ్లీజ్ రిలీజ్ చేసిన ఎంప్లాయ్మెంట్ అవుట్లుక్ సర్వే ప్రకారం..ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ క్వార్టర్లో హైరింగ్ను చేపట్టాలని 34 శాతం కంపెనీలు ప్లాన్స్ వేస్తున్నాయి. ఇది జనవరి–మార్చి క్వార్టర్లో 27 శాతంగానే ఉంది. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ పీరియడ్లో యావరేజ్గా 18 శాతం కంపెనీలు హైరింగ్ను చేపట్టాలనుకుంటున్నాయని ఈ సర్వే పేర్కొంది. కాగా, ఈ సర్వేలో 21 సెక్టార్లకు చెందిన 700 చిన్న, మధ్య తరహా, పెద్ద కంపెనీలు పాల్గొన్నాయి. ‘ఈ సారి కంపెనీలు కరోనా సంక్షోభానికి రెడీగా ఉన్నాయి. కిందటేడాదిలా తమ బిజినెస్ విస్తరణ, హైరింగ్ ప్లాన్ల నుంచి వెనక్కి తగ్గాలని అనుకోవడం లేదు’ అని చక్రవర్తి చెప్పారు.
గ్రోత్పై పాజిటివ్గా ఉన్నాం: సీఈఓలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ గ్రోత్పై పాజిటివ్ అంచనాలున్నాయి. ప్రభుత్వం కూడా తన ఖర్చులను పెంచింది. దీంతో వివిధ సెక్టార్లలో బ్లూ కాలర్ వర్కర్ల(చిన్న స్థాయి ఉద్యోగాలు) హైరింగ్ పెరుగుతుందని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. కానీ, పెరుగుతున్న కరోనా కేసులతో ఈ ప్లాన్స్ తాత్కాలికంగా ఆగొచ్చని పేర్కొంటున్నారు. హైరింగ్ యాక్టివిటీపై వివిధ కంపెనీల సీఈఓలు, చైర్మన్లు పాజిటివ్గా ఉన్నారు. వ్యాక్సినేషన్ ప్రాసెస్ ఇంకా వేగంగా జరగాలని కోరుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో కంపెనీలు నేర్చుకున్నాయని, ఉద్యోగుల నియామకాలను ఆపాలని అనుకోవడం లేదని ఎఫ్ఎంసీజీ కంపెనీ మారికో చైర్మన్ హర్ష్ మారివాలా అన్నారు. ‘కరోనా సెకెండ్ వేవ్ వేగంగా విస్తరించినా, తర్వాత తగ్గుముఖం పడుతుందనే అంచనాలున్నాయి. హైరింగ్ యాక్టివిటీ ఒకటి రెండు నెలలు ఆగిపోయినా, కంపెనీలు తమ హైరింగ్ ప్లాన్స్ను ఆపేయవు’ అని హీరానందానీ గ్రూప్ ఎండీ నిరంజన్ హీరానందానీ అన్నారు. కరోనా సెకెండ్ వేవ్ లేదా థర్డ్ వేవ్ ఉంటుందని కంపెనీలు ఇప్పటికే ఊహించాయని ఆదిత్య బిర్లా గ్రూప్ సీఈఓ శాంట్రప్ట్ మిశ్రా పేర్కొన్నారు. పెరుగుతున్న కరోనా కేసులు కంపెనీల హైరింగ్ ప్లాన్స్పై ప్రభావం చూపుతాయనుకోవడం లేదని అన్నారు. మరికొంత మంది సీఈఓలు మాత్రం కరోనా సెకెండ్ వేవ్తో హైరింగ్ యాక్టివిటీ తగ్గిందని పేర్కొన్నారు. ఉద్యోగుల నియామకాలకు సంబంధించి గత నెల రోజుల కిందట ఉన్నట్టు ఇప్పుడు లేదని ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా అన్నారు. లాక్డౌన్కు సంబంధించిన భయాలు, సెకెండ్ వేవ్ ప్రభావం వంటి అంశాలు హైరింగ్ ప్లాన్స్ను వెనక్కి లాగుతున్నాయని చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రాసెస్ కూడా అనుకున్నంత వేగంగా జరగడం లేదని అన్నారు.
శాలరీలు పెంచుతం..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల శాలరీలను పెంచాలని 59 శాతం కంపెనీలు నిర్ణయించుకున్నాయి. జీనియస్ కన్సల్టంట్స్ సర్వే ప్రకారం ఈ విషయం తెలిసింది. ‘శాలరీ హైక్’ను చేపట్టాలని 2021–22 లో 59 శాతం కంపెనీలు ప్లాన్స్ వేస్తున్నాయి. ఈ హైక్ 5–10 శాతం వరకు ఉండొచ్చు. మరో 20 శాతం కంపెనీలు మాత్రం శాలరీ హైక్ 5 శాతంలోపు ఉంటుందని పేర్కొన్నాయి. ఇంకో 21 శాతం కంపెనీలు ఈ ఏడాది కూడా శాలరీని పెంచలేమని చెప్పాయి’ అని ఈ సర్వే పేర్కొంది. ఈ సర్వేను ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆన్లైన్ ద్వారా చేపట్టారు. సుమారు 1,200 కంపెనీలు ఇందులో పాల్గొన్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, కన్స్ట్రక్షన్, ఇంజినీరింగ్, ఎడ్యుకేషన్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, హాస్పిటాలిటీ వంటి సెక్టార్లకు చెందిన కంపెనీలు ఈ సర్వేలో పాల్గొన్నాయి.
ఈ సెక్టార్లలో డిమాండ్ ఎక్కువ
టీమ్లీజ్ సర్వే ప్రకారం, ఎంట్రీ లెవెల్ జాబ్స్ కోసం కంపెనీలు ఎక్కువ మందిని నియమించుకుంటున్నాయి. జూనియర్, మిడ్ లెవెల్ కేటగిరీలో కూడా హైరింగ్ యాక్టివిటీ పెరిగింది. సీనియర్ కేటగిరీలో నియామకాలు తగ్గుతాయని ఈ సర్వే పేర్కొంది. హెల్త్ కేర్ , ఫార్మాస్యూటికల్స్, ఎడ్యుకేషనల్ సర్వీసెస్, ఈ–కామర్స్(ఆన్లైన్ షాపింగ్), టెక్నాలజీ స్టార్టప్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎఫ్ఎంసీజీ, అగ్రికల్చర్, ఆగ్రోకెమికల్ వంటి సెక్టార్లలో హైరింగ్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుందని ఈ సర్వే పేర్కొంది.