త్వరలో భారత్‌లోకి జైకొవ్‌-డి కరోనా టీకా

త్వరలో భారత్‌లోకి జైకొవ్‌-డి కరోనా టీకా

భారత్‌లో ప్రారంభమైన వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి త్వరలో మరింత మద్దతు లభించబోతోంది. గుజరాత్ లోని అహ్మదాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ ను రూపొందిస్తోంది జైడస్‌ క్యాడిలా. తాము రూపొందించిన కరోనా వ్యాక్సిన్‌ జైకొవ్‌-డి వినియోగానికి అత్యవసర అనుమతి కోసం 10-12 రోజుల్లో DCGIకి దరఖాస్తు చేసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తైనట్లు సమాచారం. ఈ ట్రయల్స్‌ కోసం మొత్తం 28 వేల మంది వాలంటీర్లను నియమించుకున్నారు.

త్వరలో జైకొవ్-డి అత్యవసర అనుమతి కోసం జైడస్‌ క్యాడిలా దరఖాస్తు చేసుకోనున్నట్లు తెలిపారు నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌.వి.కె.పాల్‌. ప్రపంచంలో మొదటి  DNA వ్యాక్సిన్‌ ఇదేనని చెప్పారు. మరోవైపు అనుమతి లభిస్తే ఆగస్టు-సెప్టెంబరు మధ్య ఐదు కోట్ల వ్యాక్సిన్‌ డోసుల్ని అందుబాటులోకి తెస్తామని జైడస్‌ క్యాడిలా తెలిపింది.

వయోజనులతో పాటు జైకొవ్‌-డి వ్యాక్సిన్‌ను 12-17 ఏళ్ల మధ్య పిల్లలపై కూడా పరీక్షిస్తున్నారు. ఫలితాలను బట్టి DCGI అనుమతిస్తే పిల్లలకు కూడా త్వరలో జైకొవ్‌-డి అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వ్యాక్సిన్‌కు అనుమతి లభిస్తే.. భారత్‌లో అందుబాటులోకి వచ్చిన నాలుగో కరోనా వ్యాక్సిన్ అవుతుంది.