
హైదరాబాద్, వెలుగు:
మున్సిపల్ రిజల్ట్స్లో టీఆర్ఎస్కు రెబల్స్ ఎఫెక్ట్ కనిపించింది. కొన్నిచోట్ల అఫీషియల్ క్యాండిడేట్ల కంటే రెబెల్స్ ఎక్కువ సంఖ్యలో గెలవగా.. మరికొన్నిచోట్ల కారు జోరుకు బ్రేకులు వేశారు. సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్లో, మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలోనూ రెబల్స్ ఎఫెక్ట్ పడటం గమనార్హం. ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాక మున్సిపాలిటీలోని 20 వార్డులకుగాను 10 చోట్ల రెబల్స్ గెలిచారు. 9 వార్డుల్లో టీఆర్ఎస్, ఒక వార్డులో బీజేపీ క్యాండిడేట్లు గెలిచారు. ఇక్కడా చైర్మన్ పీఠం తిరుగుబాటుదారులకే దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జిల్లాలోని చేర్యాలలో 12 వార్డులకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చెరో ఐదు వార్డులు గెలవగా, ఇద్దరు ఇండిపెండెంట్లు విజయం సాధించారు. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల మున్సిపాలిటీలోనూ టీఆర్ఎస్ రెబెల్స్ ఏకంగా 12 వార్డుల్లో గెలిచారు. ఇక్కడ మొత్తం 39 వార్డులకుగాను టీఆర్ఎస్ 22 చోట్ల
గెలిచింది.
కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరులో జూపల్లి వర్గానిదే పైచేయి అయింది. తన మద్దతుదారులకు టీఆర్ఎస్ టికెట్లు ఇవ్వకపోవడంతో జూపల్లి కొల్లాపూర్ మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున బరిలోకి దింపారు. 11 సీట్లతో మున్సిపాలిటీని గెలుచుకున్నారు.
అలంపూర్ నియోజకవర్గంలోని అయిజలోనూ ఎమ్మెల్యేకు షాక్ తప్పలేదు. అక్కడ 20 సీట్లకుగాను రెబెల్స్ 10 చోట్ల, కాంగ్రెస్ 6, టీఆర్ఎస్ నాలుగు స్థానాల్లో గెలిచాయి.
రామగుండం కార్పొరేషన్లోనూ ఇదే పరిస్థితి. ఫార్వార్డ్ బ్లాక్ తరఫున గెలిచిన 9 మందిలో ఏడుగురు, ఆరుగురు ఇండిపెండెంట్లలో ఇద్దరు టీఆర్ఎస్ రెబెల్సే. వారు టీఆర్ఎస్ను 18 డివిజన్లకు పరిమితం చేశారు.
మీర్పేట్ కార్పొరేషన్లో ఎనిమిది మంది ఇండిపెండెంట్లు గెలవగా.. వారిలో నలుగురు టీఆర్ఎస్ రెబెల్స్.
బడంగ్పేట కార్పొరేషన్లోనూ టీఆర్ఎస్ కు రెబెల్స్ దెబ్బతగిలింది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్కు మూడు డివిజన్లు తగ్గగా.. రెండు చోట్ల రెబెల్స్ ఇండిపెండెంట్లుగా గెలిచారు.
చౌటుప్పల్లో 20 వార్డులకు టీఆర్ఎస్ 8 చోట్ల గెలవగా.. ఇండిపెండెంట్లు 4 వార్డుల్లో గెలిచారు. ఇక్కడ కాంగ్రెస్ ఐదు, బీజేపీ మూడు వార్డుల్లో గెలిచాయి.
అమరచింతలో పది వార్డులకుగాను ఐదు చోట్ల ఇండిపెండెంట్లే గెలిచారు. మూడు వార్డుల్లో బీజేపీ, ఒక్కో వార్డులో కాంగ్రెస్, టీఆర్ఎస్ విజయం సాధించాయి.
నస్పూర్లో టీఆర్ఎస్ గెలుపును రెబెల్సే అడ్డుకున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ పది వార్డుల్లో గెలవగా, ఇండిపెండెంట్లు 6 చోట్ల విజయం సాధించారు.
కామారెడ్డి, తూంకుంట, భువనగిరి, కల్వకుర్తి, చేర్యాల, మణికొండ, ఖానాపూర్, జనగామ, కామారెడ్డి, కొంపల్లి మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ రెబెల్స్ దెబ్బకు మెజార్టీ వార్డులు గెలుచుకోలేకపోయింది