
- బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో పాల్గొన్న ఒక్కో వ్యక్తికి రూ.25 వేలు
- డొంక కదిలిస్తున్న నార్త్ జోన్.. టాస్క్ ఫోర్స్ పోలీసులు
హైదరాబాద్, వెలుగు: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మరో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు శ్రీను ఆధ్వర్యంలో కిడ్నాప్ ప్లాన్ జరిగినట్లు గుర్తించారు. ఏపీలోని విజయవాడకు చెందిన ఈవెంట్ మేనేజర్ మదాల సిద్ధార్థ్తో రూ.5 లక్షలతో డీల్ సెట్ చేసుకున్నట్లు, ఐదు వెహికల్స్, 20 మందిని మాట్లాడుకున్నట్లు ఆధారాలు సేకరించారు. నిందితుల అరెస్ట్ వివరాలను నార్త్ జోన్ డీసీపీ కల్మేశ్వర్తో కలిసి సీపీ అంజనీకుమార్ ఆదివారం వెల్లడించారు.
ఒక్కో వ్యక్తికి రూ.25 వేలు
హఫీజ్పేట్ ల్యాండ్ ఇష్యూలో అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్, తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి కలిసి ప్రవీణ్రావు ఫ్యామిలీ కిడ్నాప్కు ప్లాన్ చేశారు. ఇందుకు అఖిలప్రియ అనుచరుడు గుంటూరు శ్రీనుతో కలిసి ఈ నెల 2, 4వ తేదీల్లో కూకట్పల్లి లోధా అపార్ట్మెంట్స్, యూసుఫ్గూడలోని ఎమ్జీహెచ్ స్కూల్లో డిస్కస్ చేశారు. కిడ్నాప్ చేసి, తమకు కావాల్సిన డాక్యుమెంట్స్పై సంతకాలు తీసుకోవాలని ప్లాన్ చేశారు. ఇందుకోసం ఈవెంట్ మేనేజర్ మాదాల సిద్ధార్థ(29)ను గుంటూరు శ్రీను కలిశాడు. కిడ్నాప్ కోసం 15 నుంచి 20 మందిని అరేంజ్ చెయ్యాలని అడిగాడు. 20 మందికి ఒక్కొక్కరికి రూ.25 వేలు చొప్పున ఇచ్చేలా.. మొత్తంగా రూ.5 లక్షలకు డీల్ సెట్ చేసుకున్నారు. అడ్వాన్స్గా రూ.74 వేలు ఇచ్చారు.
పోలీస్ డ్రెస్లు.. నకిలీ నంబర్ ప్లేట్లు
కూకట్పల్లి ఫోరమ్ మాల్ దగ్గర్లోని ఎట్ హోమ్ లాడ్జీలో అందరూ షెల్టర్ తీసుకున్నారు. మియాపూర్లో 6 బేసిక్ ఫోన్లు కొన్నారు. కూకట్పల్లిలో బొమ్మ పిస్టల్, తాడు, ప్లాస్టర్స్ కొన్నారు. ఈ నెల 5న సాయంత్రం 4 గంటలకు అంతా కలిసి యూసుఫ్గూడలోని భార్గవరామ్కి చెందిన ఎమ్జీహెచ్ స్కూల్కి వెళ్లారు. అక్కడ ఐటీ, పోలీస్ కానిస్టేబుల్స్గా డ్రెస్లు వేసుకుని రెడీ అయ్యారు. కానిస్టేబుల్స్గా దేవరకొండ కృష్ణ వంశీ, కందుల శివప్రసాద్ యాక్ట్ చేశారు. భార్గవరామ్ తల్లి పేరుతో ఉన్న ఇన్నోవా కారు, మరో నాలుగు వెహికల్స్కి ఫేక్ నంబర్ ప్లేట్లు పెట్టారు. ముందుగా మనోవికాస్ నగర్లోని ప్రవీణ్రావు ఇంటి వద్ద రెక్కీ వేశారు. తర్వాత ఐటీ అధికారుల పేరుతో ప్రవీణ్రావు ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. భార్గవరామ్, గుంటూరు శ్రీను, విఖ్యాత్రెడ్డి రెండు వెహికల్స్తో ప్రవీణ్రావు ఇంటి వద్ద నిఘా పెట్టారు. మిగతా నిందితులు అంతా ఐటీ అధికారుల పేరుతో ఫేక్ ఐడీ కార్డ్స్, సెర్చ్ వారెంట్ చూపించారు. ప్రవీణ్రావు, సునీల్రావు, నవీన్రావులను బోయిన్పల్లి నుంచి కిడ్నాప్ చేశారు.
కాళీమందిర్ దగ్గర వదిలి..
కిడ్నాప్ చేసిన ముగ్గురిని మొయినాబాద్లోని భార్గవరామ్ ఫామ్హౌస్కి తీసుకెళ్లారు. బ్యాంక్ స్టాంప్ పేపర్స్, మరికొన్ని డాక్యుమెంట్స్పై సంతకాలు తీసుకున్నారు. అయితే పోలీసుల సెర్చ్ ఆపరేషన్ జరుగుతోందని అఖిలప్రియ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో అలర్ట్ అయ్యారు. ప్రవీణ్రావు, సునీల్, నవీన్లను సన్సిటీ ఔటర్రింగ్ సమీపంలోని కాళీమందిర్ వద్ద వదిలి ఎస్కేప్ అయ్యారు. కిడ్నాప్ గ్యాంగ్లో మొత్తం 29 మందిని పోలీసులు గుర్తించారు. భార్గవరామ్ పేరెంట్స్, అఖిలప్రియ తమ్ముడు విఖ్యాత్ రెడ్డి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. భార్గవరామ్, గుంటూరు శ్రీను, విఖ్యాత్రెడ్డి కోసం గాలిస్తున్నారు.
పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులు:
మాదాల సిద్ధార్థ(29), మొగిలి భాను (25), రాగోలు అంజయ్య(29), పదిర రవిచంద్ర(24), పచ్చిగల్లి రాజ(28), బానోతు సాయి(23), దేవరకొండ కృష్ణ వంశీ(24), దేవరకొండ కృష్ణసాయి(24), దేవరకొండ నాగరాజు(25), బొజ్జగాని సాయి(23), కందుల శివప్రసాద్(27), మీసాల శ్రీను(28), అన్నెపాక ప్రకాశ్(20), షేక్ దావూద్(31) వెంకట్(23).