
హైదరాబాద్: ఇంటి ఓనర్ ఏటీఎం కార్డును దొంగిలించి రూ.లక్షలు డ్రా చేసిన నిందితులను కుషాయిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సైనిక్పురిలో నివసించే ఆనంద్ రావు అనే వ్యక్తి ఇంట్లో సంపత్ కుమార్(19)అనే యువకుడు ఆగస్టు లో పనిలో చేరాడు. ఓనర్ ఆనందరావుకు తెలియకుండా ఏటీఎం కార్డును ఎత్తుకెళ్లి డబ్బులు డ్రా చేయడం మొదలు పెట్టాడు. ఏటీఎం కార్డు కనిపించకపోయేసరికి ఇంటి ఓనర్ బ్యాంకుకు వెళ్లి అమౌంట్ చెక్ చేయగా..సుమారు ఏడు లక్షల రూపాయల వరకు కనిపించకపోవడంతో అవాక్కయ్యాడు. వెంటనే కుషాయిగూడ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి సుమారు 11 లక్షల రూపాయల నగదును రికవరీ చేసి నిందితులను రిమాండ్ కు తరలించారు.