
కొత్తగా ఏర్పాటైన కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ) లడఖ్కు చెందిన ఆటగాళ్లకు దేశవాళీ క్రికెట్ ఆడే అవకాశం కల్పిస్తామని బీసీసీఐ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) హెడ్ వినోద్ రాయ్ తెలిపారు. లడఖ్ ప్లేయర్లు.. జమ్మూ కాశ్మీర్ రంజీ జట్టుకు ప్రాతినిథ్యం వహించేందుకు అనుమతిస్తామని చెప్పారు. ‘కొత్తగా ఏర్పాటైన లడఖ్ యూటీకి సపరేట్ క్రికెట్ బాడీని ఏర్పాటు చేసే ఆలోచన ప్రస్తుతానికైతే లేదు. ఈ ప్రాంతానికి చెందిన ప్లేయర్లు గతంలో మాదిరిగా బీసీసీఐ కాంపిటిషన్లలో జమ్మూ కాశ్మీర్కు ప్రాతినిథ్యం వహించొచ్చు’ అని రాయ్ ప్రకటించారు. మరో యూటీ పుదుచ్చెరి మాదిరిగా లడఖ్ను కూడా బీసీసీఐ ఓటింగ్ మెంబర్ను చేసే విషయం గురించి కూడా ఇప్పుడు చర్చలు జరపడం లేదన్నారు. జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుత పరిస్థితి గురించి బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేయడం లేదని, త్వరలోనే అంతా సర్ధుకుంటుందన్నారు. గతేడాది మాదిరిగా జమ్మూ కాశ్మీర్ తన హోమ్ మ్యాచ్లను శ్రీనగర్లో ఆడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.