
సింగరేణికి కలిసి రాని 2020
తగ్గిన ఉత్పత్తి .. పెరిగిన ఖర్చు
పవర్ ప్రొడక్షన్ లాభాలతో నష్టా లను పూడ్చే పనిలో యాజమాన్యం
గోదావరిఖని, వెలుగు : సింగరేణికి 2020‒21 ఆర్థిక సంవత్సరం కలిసివచ్చేలా లేదు. భూగర్భ గనుల్లో సాధారణంగానే ఉత్పత్తి వ్యయం పెరిగి నష్టాలు వస్తుండగా, కరోనా వల్ల లాస్ మరింత పెరిగింది. దీంతో ఆర్థిక సంవత్సరంలో గడిచిన ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఎనిమిది నెలల కాలంలో సరాసరి పరిశీలిస్తే ప్రతి టన్ను బొగ్గు ఉత్పత్తిపై రూ.637 లాస్ వస్తోంది. మిగిలిన నాలుగు నెలల కాలంలో ఓసీపీల ద్వారా నిర్దేశించిన దాని కంటే ఎక్కువ బొగ్గు ఉత్పత్తి చేస్తేనే ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకునే అవకాశాలుంటాయి. అయినా కరోనా ప్రభావం ఈ సారి సింగరేణి లాభాలపై తీవ్ర ప్రభావం చూపబోతోంది.
తగ్గిన బొగ్గు ఉత్పత్తి…
సింగరేణిలో 27 భూగర్భ గనులు, 19 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్లున్నాయి. భూగర్భ గనుల్లో తట్టా చెమ్మస్ విధానానికి స్వస్తిపలికిన యాజమాన్యం పూర్తిగా ఎస్డీఎల్, ఎల్హెచ్డీ యంత్రాలు, బీజీ ప్యానెల్, కంటిన్యూయస్ మైనర్, తదితర యంత్రాలతో బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. ఓపెన్కాస్ట్ ప్రాజెక్ట్లలో డంపర్, షవల్ కాంబినేషన్లో బొగ్గును వెలికితీస్తున్నారు. అయితే ఈ ఆర్ధిక సంవత్సరంలో కరోనా ప్రభావం వల్ల 25 భూగర్భ గనులకు మార్చి 20వ తేది నుంచి 50 రోజుల పాటు లే ఆఫ్ ప్రకటించారు. దీంతో ఈ గనుల్లో ఒక్క బొగ్గు పెల్ల కూడా బయటకు రాలేదు. అలాగే వర్షాకాలంలో 19 ఓపెన్ కాస్ట్లలో బొగ్గు ఉత్పత్తి తీవ్రంగా కుంటుపడింది. వాస్తవంగా ఆర్ధిక సంవత్సరంలో భూగర్భ గనుల్లో 9.75 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా గడిచిన తొమ్మిది నెలల కాలంలో 3.17 మిలియన్ టన్నులతో 32.50 శాతం మాత్రమే బొగ్గును వెలికితీసారు. ఇక ఓసీపీలలో ఆర్ధిక సంవత్సరంలో 60.60 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను గడిచిన తొమ్మిది నెలలో 29.49 మిలియన్ టన్నులతో 48.70 శాతం బొగ్గును ఉత్పత్తి చేశారు. ఇంకా మిగిలిన మూడు నెలల కాలంలో భూగర్భ గనుల్లో 6.58 మిలియన్ టన్నులు, ఓసీపీలలో 31.11 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా, ఈ లక్ష్యసాధన కష్టసాధ్యంగా మారనున్నది.
ఖర్చు రూ.3,007… అమ్మేది రూ.2,370
సింగరేణిలో భూగర్భ గనులు, ఓసీపీలలో వాటి సామర్ధ్యాన్ని బట్టి బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశిస్తారు. అయితే ఈ సారి ఆ టార్గెట్ను సాధించలేక వెనకబడిపోగా …అదే సమయంలో ఉత్పత్తి వ్యయం బాగా పెరిగింది. బొగ్గు ఉత్పత్తి రాకపోయినా కార్మికులకు వేతనాలు చెల్లించడం, డిజిల్ ఖర్చు పెరగడం సింగరేణికి భారంగా మారింది. కొత్తగూడెం, ఎల్లందు, మణుగూరు ఏరియాలు మినహా మిగిలిన ఏరియాలలో బొగ్గు ఉత్పత్తి వ్యయం పెరిగింది. సింగరేణి ఓవరాల్గా చూస్తే ప్రతి టన్ను బొగ్గును వెలికితీయడానికి రూ.3007 ఖర్చు అయితే ఈ బొగ్గును అమ్మగా రూ.2,370 మాత్రమే వచ్చింది. దీంతో ఇప్పటి వరకు ప్రతి టన్ను బొగ్గు ఉత్పత్తిపై రూ.637 లాస్ వచ్చింది. మొత్తంగా సింగరేణికి రూ.కోట్ల నష్టం వస్తున్నది. అయితే థర్మల్ విద్యుత్, సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా వచ్చే లాభాలు, ఓసీపీలలో వచ్చే లాభాలు, వివిధ సంస్థలకు కన్సల్టెన్సీ ద్వారా వచ్చే లాభాలతో ప్రస్తుతం ఏర్పడుతున్న నష్టాలను భర్తీ చేసే పనిలో యాజమాన్యం నిమగ్నమైంది.