
కామారెడ్డి: మారుమూల గ్రామంలో పుట్టి తన అపర మేధాశక్తితో ప్రపంచ రికార్డ్ సృష్టించింది రాష్ట్రానికి చెందిన 14 ఏండ్ల బాలిక. ఒకే రోజు వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు మరియు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం సంపాదించి తన ప్రతిభను చాటుకుంది. జిల్లాలోని బిక్నూర్ మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన పేరం మధుమిత… తన మేధాశక్తితో 330 బైనరీ నంబర్స్ ని 5 నిమిషాలు చూసి తదనంతరం చూడకుండా చెప్పి రికార్డ్ సాధించింది. 15 నిమిషాలలో రూబిక్స్ క్యూబ్స్ ని లో 57 సార్లు జత చేసింది. టార్గెట్ 45 ఉండగా.. అంతకన్నా 12 సార్లు ఎక్కువే రూబిక్స్ క్యూబ్ ని జత చేసింది. దీంతో పాటు ప్రపంచ మెమరీ ఛాంపియన్షిప్ 2020 లో జరిగిన పోటీలలో మన దేశం తరఫున మొదటి స్థానాన్ని గెలుపొందింది. ఈ సందర్భంగా స్కాడ్రన్ లీడర్, ప్రపంచ మెమొరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు జయసింహ మాట్లాడుతూ… తన శిక్షణలో రెండు రికార్డులను సొంతం చేసుకున్న మధుమిత కు అభినందనలు తెలియజేశారు. మధుమిత భవిష్యత్తులో చాలా రికార్డ్స్ సాధించి దేశానికి మెమరీ పవర్ గా మారుపేరుగా మారుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ జడ్జిస్ నరేందర్ గౌడ్,విజయలక్మి, దేవేందర్ ,లింకా బుక్ ఆఫ్ రికార్డ్ జడ్జెస్ జయ సింహ, బాలమురళి, గమనం,మూర్తి, తల్లిదండ్రులు పేరం కల్పన స్వామి బంధువులు,మిత్రులు పాల్గొన్నారు.