- బీజేపీ విజయానికి అందరం కష్టపడదాం
కంటోన్మెంట్, వెలుగు: వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కష్టపడి బీజేపీ విజయానికి కృషి చేద్దామని మధ్య ప్రదేశ్ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పిలుపునిచ్చారు. శివాజీ, రాణా ప్రతాప్ లాంటి నేత ప్రధాని మోదీ అని కొనియాడారు. బీజేపీ సిద్ధాంతాలపై నడిచే పార్టీ అని పేర్కొన్నారు. గురువారం బోయిన్పల్లిలోని ఇంపీరియల్ గార్డెన్లో జరిగిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ బూత్ అధ్యక్షులు, ఆ పై స్థాయి నేతలతో నిర్వహించిన సమావేశానికి సీఎం మోహన్ యాదవ్ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
దేశాన్ని పాలించే సమర్థవంతమైన నేత ప్రధాని మోదీ అని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ మత కల్లోలాలను సృష్టించిందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళల కు న్యాయం చేసిందని తెలిపారు. మరోసారి మోదీని ప్రధానిని చేసేందుకు నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ మొదటి వారంలో పార్లమెంటు ఎన్నికలు ఉండొచ్చని, ఫిబ్రవరి చివరి వారంలో ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ ఎన్నికలు దేశ ప్రజలకు చాలా ప్రతిష్టాత్మకమైనవన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మన్, మర్రి శశిధర్ రెడ్డి, ఈటల రాజేందర్,పెద్ద సంఖ్యలో బీజేపీ నేతలు పాల్గొన్నారు.