కరోనా రహిత గ్రామాలకు 50 లక్షల బహుమతి

కరోనా రహిత గ్రామాలకు 50 లక్షల బహుమతి

ముంబయి: కరోనా కట్టడి విషయంలో మూడు నెలలుగా తీవ్రంగా సతమతం అవుతున్న మహారాష్ట్ర ప్రపంచంలోనే తొలిసారిగా  గ్రామాల్లో కరోనా కట్టడి కోసం వినూత్న తరహా లో పోటీని ప్రవేశపెట్టింది. 50 లక్షల రూపాయల వరకు ప్రైజ్ మనీతో ‘కరోనా ఫ్రీ విలేజ్’ పోటీని ప్రారంభించింది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి ఉద్దవ్ మాట్లాడుతూ కరోనా వ్యాప్తి నిరోధానికి ఆరోగ్యకరమైన పోటీని.. అవగాహనను కల్పించే ఉద్దేశంతో ప్రారంభిస్తున్నామన్నారు. 

రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖా మంత్రి హసన్ ముష్రిఫ్ మాట్లాడుతూ ‘కరోనా ఫ్రీ విలేజ్’ పోటీ కరోనా కట్టడి ప్రయత్నంలో ఒక భాగమని అన్నారు. కరోనా కట్టడిలో విజయవంతమైన ఉత్తమ మూడు గ్రామ పంచాయతీలకు బహుమతి డబ్బు ఇవ్వబడుతుందన్నారు. మొదటి బహుమతి కింద 50 లక్షలు, రెండో బహుమతి కింద 25 లక్షలు, మూడో బహుమతి కింద 15 లక్షలు చొప్పున ఇస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని ఆరు రెవెన్యూ విభాగాలు ఉన్నందున మొత్తం 18 బహుమతులు ఉంటాయని, ఈ మొత్తం బహుమతి డబ్బు రూ .5.4 కోట్లు కేటాయించామని ఆయన వివరించారు. పోటీలో గెలిచిన గ్రామాలకు బహుమతి డబ్బుతో సమానమైన అదనపు మొత్తం ప్రోత్సాహంగా ఇస్తామని, ఈ డబ్బు గ్రామాల్లోని అభివృద్ధి పనులకు ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు.  
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఠాక్రే ఆదివారం వర్చువల్ ద్వారా స్థానిక ప్రజా ప్రతినిధులతో మాట్లాడారు. మహారాష్ట్రలోని అతి పిన్న వయసు సర్పంచ్ అయిన షోలాపూర్ జిల్లా ఘాట్నే గ్రామ సర్పంచ్ రుతురాజ్ దేశ్ ముఖ్ (21)తో మాట్లాడుతూ గ్రామంలో కరోనా వైరస్ లేకుండా ఉంచడానికి చేస్తున్న కృషిని ప్రశంసించారు. మరో వైపు మహారాష్ట్రలో మంగళవారం  14 వేల 123 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనా మరణాల సంఖ్య 96 వేల 198కి చేరుకుంది.