
హైదరాబాద్, వెలుగు: లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఫార్మా, బయోటెక్ పరిశ్రమను 50 బిలియన్ డాలర్ల నుంచి 100 బిలియన్ డాలర్లకు పెంచడమే లక్ష్యమన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో వచ్చే దశాబ్దంలో కొత్తగా 4 లక్షల ఉద్యోగాలను సృష్టించడంపై దృష్టి సారించామని చెప్పారు. సోమవారం హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ప్రారంభమైన 17వ బయోఏషియా–2020 సదస్సుకు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ ఫార్మా ఉత్పత్తిలో 35% వాటా హైదరాబాద్దేనని అన్నారు. అతి పెద్ద ఫార్మా సిటీ హైదరాబాద్లో ఏర్పాటు చేశామని, వరల్డ్ బయో క్లస్టర్గా తెలంగాణ అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఆసియాలో అతిపెద్ద లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో ఒకటైన జీనోమ్ వ్యాలీని విస్తరిస్తామని, ఇందుకోసం జీనోమ్ వ్యాలీ 2.0 మాస్టర్ప్లాన్ రూపొందించామని తెలిపారు. సింజిన్ కంపెనీ బెంగళూర్ తర్వాత హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీకి రూ.170 కోట్లతో తొలిదశలో విస్తరించడం సంతోషకరమన్నారు. జీవీకే బయో, సాయి లైఫ్ సైన్సెస్తోపాటు ఎన్నో కంపెనీలు హైదరాబాద్ను గ్లోబల్ఆర్ అండ్ డీ హబ్గా మార్చాయని, సింజీన్ రాకతో ఆ స్థానం మరింత పటిష్టమవుతుందన్నారు. లైఫ్ సైన్సెస్ గ్రిడ్ కింద హైదరాబాద్ ఫార్మా సిటీని రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోందని, పారిశ్రామిక నగరాలకు ఒక నమూనాగా ఈ ఫార్మాసిటీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్ కూడా తమ ఇండియా ఔట్పోస్టు ఏర్పాటుకు హైదరాబాద్ను ఎంచుకోవడం సంతోషంగా ఉందన్నారు.
వరల్డ్ వ్యాక్సిన్ క్యాపిటల్గా హైదరాబాద్
వరల్డ్ వ్యాక్సిన్ క్యాపిటల్గా హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, ప్రపంచానికి కావాల్సిన మూడో వంతు వ్యాక్సిన్ ఇక్కడి నుంచే సరఫరా అవుతోందని కేటీఆర్అన్నారు. తక్కువ ధరలో ఔషధ ఉత్పత్తులను తయారు చేయాలని సైంటిస్టులు, పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైసెస్ పార్కును హైదరాబాద్లో 276 ఎకరాల్లో ఏర్పాటు చేశామని, ఇప్పటికే 20కిపైగా కంపెనీలు డివైసెస్ తయారీని, ఆర్అండ్ డీ యూనిట్లను ఏర్పాటు చేశాయని తెలిపారు. ఆసియాలో అతిపెద్ద స్టంట్తయారీ కంపెనీ సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ తన డెస్టినేషన్గా హైదరాబాద్ను ఎంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సమ్మిట్లో వైద్య పరికరాలు, హెల్త్టెక్పై దృష్టి సారించామని, ఈ రంగంలో ఉన్న అవకాశాలపై చర్చించడానికి మెడీటెక్ కంపెనీల లీడర్స్ సమావేశం అవుతారని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. సదస్సులో స్విట్జర్లాండ్ రాయబారి డాక్టర్ ఆండ్రియాస్ బామ్, లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్అండ్ ట్రోపికల్ మెడిసిన్ ప్రతినిధిడాక్టర్ పీటర్ పియట్, సింజీన్ సీఎండీ కిరణ్ మజూందర్, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, బయో ఏషియా సీఈవో శక్తి నాగప్పన్, డాక్టర్ రెడ్డీస్ ఫార్మా సీఎండీ సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, కేన్సర్ ట్రీట్మెంట్కు పేరుగాంచిన కార్-టీ థెరపీకి ఆద్యుడు డాక్టర్ కార్ల్ జూన్కు ఈ ఏడాది జీనోమ్ వ్యాలీ ఎక్స్లెన్స్ అవార్డును కేటీఆర్ అందజేశారు. 75 స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిట్స్ను కేటీఆర్ ప్రారంభించారు.
బయోలాజికల్ ఈ లిమిటెడ్ ప్రారంభం
జీనోమ్ వ్యాలీలో సోమవారం ప్రారంభించిన బయోలాజికల్ ఈ లిమిటెడ్ వ్యాక్సిన్ కొత్త యూనిట్ వల్ల వెయ్యి మందికి ఉపాధి కలగనుందని కేటీఆర్ ట్వీట్ చేశారు. రూ.300 కోట్ల ఖర్చుతో ఏర్పాటుచేసిన ఈ ప్లాంట్ తో కొత్త వ్యాక్సిన్లు కనుగొనే అవకాశం ఉందన్నారు. జీనోమ్ వ్యాలీలో ఎంఎన్ పార్క్ పేరుతో కొత్త ల్యాబ్ బిల్డింగ్ను ప్రారంభించినట్లు మరో ట్వీట్ చేశారు. సిన్ జెనిటల్ ప్రారంభంతో ఆసియాలో లైఫ్ సెన్సస్ క్లస్టర్ గా జీనోమ్ వ్యాలీ నిలవనుందని కేటీఆర్ మరో ట్వీట్ లో పేర్కొన్నారు.