
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో తిరుగులేని హవా కనబరుస్తోంది టీఆర్ఎస్ పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ మునిసిపాలిటీల్లో విజయం సాధిస్తూ దూసుకుపోతోంది. దీంతో తెలంగాణ భవన్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని సంబరాలు చేసుకుంటున్నారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్లో కూర్చుని ఫలితాల ట్రెండ్ను పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కారు జోరు స్పష్టంగా కనిపిస్తుండడంతో మంత్రుల్లో సంతోషం కనిపిస్తోంది. ఏ ఒక్క మున్సిపాలిటీ ఓడినా పదవులు ఊడుతాయని సీఎం కేసీఆర్ హెచ్చరించిన నేపథ్యంలో వారి వారి పరిధిలో విస్తృతంగా ప్రచారం చేసి మంచి ఫలితాల కోసం ప్రయత్నించారు. తమ కృషికి తగ్గ ఫలితం రావడంతో వారు ఆనందంలో మునిగిపోయారు. పార్టీ శ్రేణులతో కలిసి సంబరాలు జరుపుకొంటున్నారు.