- నల్గొండ జిల్లాలో ఈ ఏడాదిలో చేరింది 4,600 మందే...
- గతేడాది చేరిన స్టూడెంట్లు 17,600
- ప్రైవేటు స్కూల్స్ నుంచి 1500 మంది రాక
- ఇంగ్లీష్ మీడియం ప్రారంభంపై కనిపించని ప్రచారం
నల్గొండ, వెలుగు : సర్కార్ స్కూళ్లలో స్టూడెంట్ల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఫలితం ఇవ్వడం లేదు. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంతో పాటు, ‘మన ఊరు మన బడి’ కింద అభివృద్ధి పనులు సైతం చేస్తున్నారు. గతంలో సక్సెస్ ప్రోగ్రాం ద్వారా ఇంగ్లీష్ మీడియం అమలు అవుతున్నప్పటికీ ప్రస్తుతం దానిని ప్రైమరీ క్లాసులకు సైతం వర్తింపజేశారు. దీంతో ఈ సంవత్సరం అడ్మిషన్లు భారీ సంఖ్యలో నమోదు అవుతాయని సర్కార్ భావించింది. కానీ స్టూడెంట్లను సర్కార్ స్కూల్కు రప్పించడంపై ఆఫీసర్లు అంతగా దృష్టి పెట్టకపోవడంతో గతేడాదితో పోలిస్తే ప్రసుత్తం ఎన్రోల్మెంట్ చాలా తక్కువగా కనిపిస్తోంది. అడ్మిషన్ల కోసమే బడిబాట కార్యక్రమాన్ని ఈ నెల 30 వరకు పొడిగించారు. అయినా స్టూడెంట్ల చేరికలు మాత్రం ఆశించిన స్థాయిలో జరగడం లేదు.
కొత్త విద్యార్థులు 4,600 మందే...
ఈ నెల 13న స్కూల్స్ రీ ఓపెన్ కాగా, 3వ తేదీ నుంచి కొత్త స్టూడెంట్ల నమోదును ప్రారంభించారు. అప్పటి నుంచి 25 వరకు జిల్లా వ్యాప్తంగా సర్కార్ స్కూళ్లలో చేరింది కేవలం 4,600 మంది స్టూడెంట్లు మాత్రమే. ఇందులో ప్రైవేట్ స్కూల్స్ నుంచి 1,550 మంది సర్కార్ స్కూల్స్లో చేరారు. కొత్త విద్యార్థుల నమోదు ఎక్కువగా ప్రైమరీ క్లాస్లలో జరుగుతుంది. కానీ అడ్మిషన్లపైన టీచర్లు ఫోకస్ పెట్టకపోవడంతో ఫస్ట్ క్లాస్లో కేవలం 435 మంది మాత్రమే చేరారు. అలాగే ప్రైవేట్ స్కూల్స్ నుంచి 273 మంది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్లు సర్కారు బడుల్లో చేరారు.
గతేడాది పోలిస్తే తగ్గిన ఎన్రోల్మెంట్
గతేడాది పోలిస్తే ఈ సారి సర్కారు బడుల్లో ఎన్రోల్మెంట్ భారీ సంఖ్యలో తగ్గింది. కరోనా టైంలో ఆర్థికభారం భరించలేక చాలా మంది పేరెంట్స్ తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్స్ నుంచి తప్పించి సర్కార్ స్కూల్లో జాయిన్ చేశారు. దీంతో గతేడాది కొత్త అడ్మిషన్లు 17,682 ఉండగా, ఇందులో ప్రైవేట్ స్కూల్ నుంచి 4,765 మంది స్టూడెంట్లు సర్కారు బడుల్లో చేరారు. కానీ ఈ సారి అన్ని తరగతులకు కలిపి విద్యార్థుల ఎన్రోల్మెంట్ నాలుగు వేలకు పడిపోయింది. సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టినందున ప్రైవేట్ స్కూళ్ల నుంచి భారీ సంఖ్యలో స్టూడెంట్లు వచ్చి సర్కార్ స్కూళ్లలో చేరుతారని భావించినా అదీ నెరవేరలేదు. పైగా గత విద్యాసంవత్సరంలో ఒకటో తరగతిలో చేరిన కొత్త విద్యార్థులే 5,590 మంది ఉండగా, ఆ తర్వాత ఆరో తరగతిలో 4,867 మంది ఉన్నారు. కానీ ఈ సంవత్సరం ఒకటో తరగతిలో డైరెక్ట్ అడ్మిషన్లు, ప్రైవేట్ స్కూళ్ల నుంచి వచ్చిన అడ్మిషన్లు కలిపి 708 మాత్రమే. రెండో తరగతి నుంచి ఏడో తరగతి వరకు చేరిన స్టూడెంట్లు 1,550 మంది మా త్రమే ఉన్నారు.