
- అన్ని వర్గాలకు చాన్స్ ఇస్తూ కమిటీలు ఫైనల్ చేసేందుకే జాప్యం
- పీసీసీ పగ్గాలపై జీవన్ రెడ్డి అనాసక్తి.!
- కొత్త ప్రచారంతో రేవంత్ వర్గంలో అసంతృప్తి
- ప్రకటన కోసం రోజంతా ఎదురుచూసిన కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్, వెలుగు: కొత్త పీసీసీ చీఫ్ఎంపిక సోనియా గాంధీ వద్ద పెండింగ్లో పడినట్లు ఢిల్లీలోని ఏఐసీసీ వర్గాలు చెప్తున్నాయి. సోషల్ ఇంజనీరింగ్ కోసం పీసీసీ, ఇతర కమిటీల లిస్ట్ ను ఆమె తన వద్దనే ఉంచుకున్నట్లు తెలుస్తోంది. కమిటీల్లో రెడ్లతోపాటు ఎస్సీ, బీసీ వర్గాల సమాతూకం కోసం ఆపినట్లు సమాచారం. త్వరలో ఈ ఎక్సర్సైజ్ పూర్తి చేస్తారని, ఇప్పటికే చేసుంటే.. ఇటలీ నుంచి రాహుల్గాంధీ కూడా వచ్చాక ప్రకటిస్తారని అంటున్నారు. మరో మూణ్ణాలుగు రోజుల్లో ఆయన ఇండియా వస్తారని చెప్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడానికి జీవన్రెడ్డి కూడా సుముఖంగా లేరని.. ఇదే విషయాన్ని ఆయన అధిష్టానానికి కూడా చెప్పినట్లు తెలుస్తోంది. అయితే సడెన్గా జీవన్రెడ్డి పేరు తెరపైకి రావడంతో రేవంత్ వర్గంలో అసంతృప్తి నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోంది. పీసీసీ చీఫ్ తోపాటు ఇతర నియామకాల ప్రకటన మంగళవారం వెలువడుతుందని ప్రచారం జరిగినప్పటికీ అధిష్టానం నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్రాలేదు. అంతా దీని గురించే చర్చించుకున్నరు. ఎలాంటి ప్రకటన రాకపోవడంతో చాలా మంది నేతలు ఢిల్లీకి ఫోన్ చేసి పరిణామాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.
ఇదీ ఏఐసీసీ నేతల అంచనా
రాష్ట్ర ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్ను సంప్రదిస్తే ఆయన మరో మూణ్ణాలుగు రోజుల టైమ్ పడుతుందని చెప్పినట్లు తెలిసింది. కాంగ్రెస్ నేతలు కూడా ఢిల్లీకి ఫోన్ చేస్తే ‘ప్రాసెస్ ఈజ్ డిలేయిడ్’ అనే మెసేజ్ వచ్చినట్లు చెప్పారు. పీసీసీ చీఫ్ పదవికి జీవన్ రెడ్డి, ప్రచార కమిటీకి రేవంత్ రెడ్డితోపాటు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డిలకు వివిధ కమిటీల చైర్మన్లుగా పదవులు దక్కుతాయని ప్రచారం సాగింది. ఈ లిస్ట్ను పరిశీలిస్తే రెడ్డి కులస్తులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు కనిపించిందనీ, దాంతో మిగతా కులాలకు కూడా చాన్స్ ఇవ్వడం కోసం సోనియా గాంధీయే లిస్టును తన వద్దనే ఉంచుకున్నారని నాయకులు అంటున్నారు. బీసీ, ఎస్సీ వర్గాల సమతూకం కోసం ఆపినట్లు చెప్తున్నారు. పీసీసీ కమిటీతోపాటు ఎలక్షన్ మేజేజ్మెంట్ కమిటీ, స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, అడ్వయిజరీ బోర్డులను ఏర్పాటు చేస్తే సీనియర్, జూనియర్ నేతలందరికీ పదవులు దక్కడంతోపాటు అన్ని కులాల వారికి ఇంపార్టెన్స్ దక్కేలా చూడవచ్చని అధిష్టానం భావించి ఉండవచ్చని అంటున్నారు. ఒకవేళ ఈ కసరత్తు అంతా ఇప్పటికే జరిగితే రాహుల్ గాంధీ ఇటలీ నుంచి వచ్చిన తర్వాత లిస్ట్ రిలీజ్అయ్యే చాన్స్ ఉందని ఏఐసీసీ నేతలు చెప్తున్నారు.
లేటు రేవంత్కు ప్లస్ అవుతుందా?
జీవన్ రెడ్డి అందరూ ఒప్పుకునే నేత అయినా.. ప్రస్తుత పరిస్థితుల్లో పీసీసీ చీఫ్ ఇమేజ్ ఇంకో రకంగా ఉండాలని కేడర్ భావిస్తోంది. ఈ క్రమంలోనే మాస్ ఇమేజ్ ఉన్న రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్లు తెర మీదకు వచ్చాయి. రేవంత్ అయితే సూపర్ అంటూ ప్రచారం జరిగింది. యువ నేతలు పార్టీ పగ్గాలు చేపడితే ఊపు వస్తుందని భావించారు. జీవన్ రెడ్డి పేరు తెర మీదకు రాగానే చాలా మంది నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రేవంత్ వర్గం తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం. తనకు ప్రచార కమిటీయే బెటర్ అని రేవంత్ ఒక మీడియాతో అన్నా ఆయన మనసు పీసీసీ ప్రెసిడెంట్ పోస్టు పైనే ఉన్నట్లు సమాచారం. అందుకే ఆయన సన్నిహిత నేతలు కొందరు మరికొంత టైమ్ తీసుకుంటే ఈ లోపున పరిస్థితి అనుకూలంగా మారవచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అసంతృప్తితో ఉన్న సీనియర్లను బుజ్జగించేందుకు టైమ్ దొరుకుతుందని అనుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇటలీలో ఉన్న రాహుల్ వచ్చాక కూడా ఈక్వేషన్లు మారుతాయనే ఆశ వారిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇట్ల పీసీసీ చీఫ్ అనౌన్స్మెంట్కి కొద్ది రోజులు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది.
‘సాగర్’ బైఎలక్షన్ వరకు వాయిదా?
పీసీసీ ప్రెసిడెంట్ను అనౌన్స్ చేస్తే పార్టీ డిస్టర్బ్ అవుతుందనీ, నాగార్జునసాగర్ బైఎలక్షన్ జరిగే వరకు ఆగాలని సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి ఢిల్లీకి ఫోన్ చేసినట్లు తెలిసింది. అధిష్టానం ఆర్డర్ను తామంతా పాటిస్తామనీ, కాకపోతే పార్టీలో ఏమాత్రం అలజడి చెలరేగినా అది తన ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందని ఆయన నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ఆయన అంతటితో ఆగకుండా లెటర్ కూడా రాసినట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. కాగా జీవన్ రెడ్డి కూడా పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రెడీగా లేనని అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీని నడపడం ఖర్చుతో కూడుకున్న పని అనీ, తనకు ఢిల్లీ రాజకీయాలు సరిపోవని ఇంతకు ముందే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించి టెంపరరీగా కొద్ది రోజులు కొనసాగాలని ఏఐసీసీ నేతలు కన్విన్స్ చేస్తున్నట్లు సమాచారం. అయితే జీవన్ రెడ్డి మాత్రం ఎన్ని రోజులు పదవిలో ఉన్నా తలనొప్పులే ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది.