
ఇండియా, బంగ్లాదేశ్ ఫ్యాన్స్తో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పింక్ పోరుకు రంగం సిద్ధమైంది..! మరికొన్ని గంటల్లోనే ఈడెన్లో ‘గులాబీ గంట’ మోగనుంది..! రెండు జట్లు తొలిసారి పింక్ బాల్ బరిలో నిలవగా.. డే నైట్లో ఎస్జీ బాల్స్ను ఫస్ట్ టైమ్ వాడుతున్నారు. టీమిండియా ఫ్యాన్స్ కూడా తొలిసారి ప్రత్యక్ష్యంగా గులాబీ వార్ను చూడబోతున్నారు. అయితే, వన్డే, డే టెస్టు ఏ టైమ్లో ఎలా ఆడతారో అవగాహన ఉన్నా.. పింక్ పోరుపై కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి..! మ్యాచ్ టైమింగ్ దగ్గరి నుంచి పిచ్ స్పందన వరకూ చాలా ప్రత్యేకతలు ఉన్న ఈ డే నైట్ గురించి తెలుసుకోవాల్సిన ఆ విశేషాలేమిటో చూద్దాం..!
డే నైట్ మ్యాచ్ను ఏ టైమ్కు స్టార్ట్ చేయాలన్నది హోస్ట్ టీమ్ ఇష్టం. ఇదివరకు జరిగిన 11 మ్యాచ్లు ఆయా దేశాల టైమింగ్స్ ప్రకారం వేర్వేరు సమయాల్లో మొదలయ్యాయి. సౌతాఫ్రికా–జింబాబ్వే మ్యాచ్ అన్నింటికంటే ముందుగా మధ్యాహ్నం 1.30కు షురూ అయింది. నైట్ టైమ్లో మంచును దృష్టిలో ఉంచుకొని ఈడెన్ పోరును ఇంకాస్త ముందుగా అంటే.. ఒంటిగంటకే స్టార్ట్ చేయాలని బోర్డు నిర్ణయించింది. మధ్యాహ్నం12.30కు టాస్ వేస్తారు. లంచ్కు 40 నిమిషాలు, టీకి 20 నిమిషాలు బ్రేక్ ఇస్తారు. మధ్యాహ్నం 3 నుంచి 3.40 మధ్య లంచ్, సాయంత్రం 5.40 నుంచి 6 మధ్య టీ విరామం ఉంటుంది. రాత్రి 8 గంటలకు ఆట ముగుస్తుంది.
పిచ్ కాస్త డిఫరెంట్
టెస్టు క్రికెట్లో పిచ్ ప్రభావం కీలకం. పింక్ మ్యాచ్ల్లో అది మరింత ఎక్కువ ఉంటుంది. మ్యాచ్ సమయంలో ఆటగాళ్లకు పింక్ బాల్ విజిబిలిటీ విషయంలో పిచ్, ఔట్ఫీల్డ్ ప్రభావం చూపుతాయి. బంతి తొందరగా రఫ్గా మారకుండా, పాడవకుండా ఉండేందుకు గ్రౌండ్స్టాఫ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అందుకోసం పిచ్తో పాటు ఔట్ఫీల్డ్లో తగినంత గ్రాస్ ఉంచాలి. పిచ్పై సాధారణంగా 4 మిల్లీమీటర్ల పొడవు పచ్చిక ఉంటుంది. అయితే, పింక్ బాల్ ఎక్కువసేపు మన్నికగా ఉండేందుకు ఈ మ్యాచ్ కోసం 6 మిల్లీమీటర్ల గ్రాస్ ఉంచినట్టు ఈడెన్ గార్డెన్స్ గ్రౌండ్స్మెన్ హెడ్ సుజన్ ముఖర్జీ చెబుతున్నాడు. ఈ విషయంలో బ్యాట్స్మెన్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2015లో ఆస్ట్రేలియా–న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫస్ట్ డే నైట్ టెస్టు కోసం అడిలైడ్ ఓవల్ పిచ్పై 11 మి.మీ గ్రాస్ ఉంచారు.
గ్రీన్ వికెట్టే కానీ..
గ్రాస్ పొడవు ఎక్కువ ఉండడం వల్ల వికెట్ గ్రీన్గా కనిపిస్తుంది కానీ.. ఇది పూర్తిగా బౌలర్లకు సహకరించే గ్రీన్ వికెట్ కాదు. ఇది పింక్ మ్యాచ్కు కచ్చితంగా ఉండాల్సిన గ్రీన్ ‘గ్రాస్ కవర్’ మాత్రమే. అంతేకాని తేమతో కూడిన గ్రీన్టాప్ కాదు. పింక్ బాల్పై పాలిష్ త్వరగా తొలగిపోకుండా ఉండేందుకు ఈడెన్లో ఈ గ్రాస్ కవర్ను ఉంచుతారు. ఇక కార్పేట్ పరిచినట్టుగా ఉండే ఔట్ఫీల్డ్తో బౌలర్లకు మరింత అడ్వాంటేజ్ ఉంటుందని ముఖర్జీ చెబుతున్నాడు. ఈ మ్యాచ్ పిచ్ విషయంలో అదనంగా ఏమీ చేయడం లేదని, రోలింగ్ కూడా సాధారణంగానే
చేస్తున్నామని చెప్పాడు.
మంచు ప్రభావం తప్పదు
మ్యాచ్లో మంచు ప్రభావం కచ్చితంగా ఉంటుంది. పైగా ఇది చలికాలం. కోల్కతాలో సాయంత్రం 4 దాటగానే సూర్యాస్తమయం మొదలవుతోంది కాబట్టి లాస్ట్ సెషన్ స్టార్టింగ్ నుంచే మంచు కురవొచ్చు. మంచు ఎక్కువగా ఉంటే బౌలర్లకు బంతిపై గ్రిప్ దొరకదు. మంచు ఎఫెక్ట్ను నివారించాలంటే ఔట్ఫీల్డ్లో గ్రాస్ను బాగా కత్తిరించి, ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. అందుకోసం మ్యాచ్కు కొన్ని రోజుల ముందే ఔట్ఫీల్డ్కు వాటరింగ్ ఆపాలి. అయితే, ఈడెన్లో మంచు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖర్జీ అంటున్నాడు. మంగళవారం నుంచే గ్రౌండ్లో యాంటీ–డ్యూ స్ప్రేలు వాడుతున్నామని చెప్పాడు.
బాల్ కలర్ మాత్రమే డిఫరెంటా?
ఇరు జట్లకే కాదు ఎస్జీ బాల్ కంపెనీకి కూడా ఇదే తొలి డే నైట్ మ్యాచ్. కాంపిటీటివ్ క్రికెట్లో ఎస్జీ పింక్ బాల్స్ వాడడం ఇదే ఫస్ట్ టైమ్. కేవలం కలర్ మాత్రమే కాదు రెడ్ బాల్తో పోల్చితే పింక్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. రెడ్ బాల్పై సీమ్ను తెల్లదారంతో కుడితే.. పింక్పై నల్లదారం ఉంటుంది. మంచును దృష్టిలో ఉంచుకొని లినెన్ దారం ఉపయోగించడం వల్ల సీమ్ ఎక్కువ టైమ్ ఉండనుంది. అలాగే, బంతి మెరుపు త్వరగా డ్యామేజ్ కాకుండా ఉండేందుకు ఇచ్చే ఎక్స్ట్రా కెమికల్ కోటింగ్ (లక్క) వల్ల మంచి స్వింగ్ కూడా రాబట్టొచ్చు.
షేప్ మారితే మరో బాల్
నిర్ణీత ఓవర్లలోపే బాల్ షేప్ మారినా, పాడైనా సాధారణంగానే అఫీషియల్స్ వెంటనే మరో బంతి (పాత)ని తీసుకోవచ్చు. అందుకోసం ట్రెయినింగ్, మ్యాచ్ సందర్భంగా వాడిన పాత బంతులతో కూడిన ఓ ‘లైబ్రరీ’ వారి వద్ద ఉంటుంది. రెండు వారాల కిందటే ఇండియా, బంగ్లాదేశ్ జట్లకు 8 నుంచి 10 డజన్ల ఎస్జీ బాల్స్ ఇచ్చారు. ప్లేయర్లు ట్రెయినింగ్ సెషన్లలో వాడిన ఈ బాల్స్ను మ్యాచ్ అఫీషియల్స్, బీసీసీఐ తిరిగి తీసుకొని లైబ్రరీలో భద్రపరిచింది. మ్యాచ్ సందర్భంగా పాత బాల్ అవసరమైతే లైబ్రరీ నుంచి తీసుకుంటారు.
కనబడకపోతే.. ముందుగానే లైట్లు
సూర్యాస్తమయ సమయంలో పింక్ బాల్ సరిగ్గా కనిపించడం లేదని డొమెస్టిక్ మ్యాచ్ల సందర్భంగా ఫిర్యాదులు వచ్చాయి. ఒకవేళ ఈడెన్లో ఈ పరిస్థితి ఎదురై.. బ్యాట్స్మెన్ కంప్లెయింట్ చేస్తే మ్యాచ్ అఫీషియల్స్ ముందుగానే ఫ్లడ్ లైట్లు ఆన్ చేయిస్తారు.
పింక్.. పేసర్లదా.. స్పినర్లదా!
ఈడెన్ గార్డెన్స్ కండిషన్స్ సీమర్లకు సూటవుతాయని, స్పిన్నర్లకు కాస్త ఇబ్బందే అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా, వికెట్పై గ్రాస్ ఎక్కువగానే ఉండనుంది. అదే సమయంలో ఇప్పటిదాకా జరిగిన 11 డే నైట్ టెస్టుల్లో మొత్తం 366 వికెట్లు పడితే అందులో స్పిన్నర్లు 96 వికెట్లు మాత్రమే తీశారు. ఈ లెక్కన పింక్ బాల్పై పేసర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ, ఈడెన్లోనూ పూర్తిగా అలాంటి పరిస్థితిని ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే ఉపఖండంలో పరిస్థితులు వేరుగా ఉంటాయి. సహజంగానే ఇక్కడ స్పిన్నర్లు ప్రభావం చూపుతారు. 11 డే నైట్ టెస్టుల్లో ఆసియాలో జరిగిన రెండు మ్యాచ్లను పరిశీలిస్తే.. పింక్ పూర్తిగా పేసర్లదే అన్న అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందే. దుబాయ్లో జరిగిన ఈ రెండు మ్యాచ్ల్లో 73 వికెట్లు పడితే అందులో స్పిన్నర్లే 46 వికెట్లు తీశారు. పైగా, పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా రెండు సార్లు ఐదేసి వికెట్ల హాల్స్ తీయగా, వెస్టిండీస్ స్పిన్నర్ దేవేంద్ర బిషూ ఓ ఇన్నింగ్స్లో ఏకంగా 8 వికెట్లు తీశాడు. ఫింగర్ స్పిన్నర్లతో పోల్చితే రిస్ట్ స్పిన్నర్లు డేనైట్లో మరింత ఎఫెక్టివ్గా బౌలింగ్ చేయగలరని హర్భజన్ సింగ్ లాంటి వెటరన్ల అభిప్రాయం.
జోరుగా ప్రాక్టీస్
కోల్కతా: హిస్టారికల్ డేనైట్ టెస్ట్ నేపథ్యంలో ఇండియా ప్లేయర్స్ ఈడెన్ మైదానంలో బుధవారం జోరుగా ప్రాక్టీస్ చేశారు. ఫుట్బాల్ ఆడటంతో మొదలైన ప్రాక్టీస్.. ఫీల్డింగ్, స్లిప్ క్యాచ్లు, లాంగ్ క్యాచ్లతో పాటు బ్యాటింగ్, బౌలింగ్ సాధనతో ముగిసింది. పింక్ బాల్ బౌలర్లకు అనుకూలిస్తుందన్న విశ్లేషకుల మాటలతో కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో సహా ఆటగాళ్లంతా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. తొలి టెస్ట్ అనంతరం మొదటి సారి ప్రాక్టీస్లో పాల్గొన్న కోహ్లీ పేసర్లతోనే ఎక్కువ ప్రాక్టీస్ చేశాడు. స్టార్ పేసర్ మహ్మద్ షమీ వేసిన పలు బంతులను ఎదుర్కొన్న అతను.. బంతిని బాగా స్వింగ్ చేస్తున్న షమీని అభినందించడం కనిపించింది. పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశాలు రాని అశ్విన్, జడేజా కూడా పింక్ బంతిని ఎదుర్కొన్నారు. వికెట్ కీపర్ల సాహా, పంత్తో పాటు మయాంక్, పుజారాలు సైతం నెట్స్లో చెమటోడ్చారు.
లెజెండ్స్ వస్తున్నారు..
కోల్కతా: ఇండియా–బంగ్లాదేశ్ డేనైట్ టెస్ట్కు పలువురు లెజెండరీ ప్లేయర్లు హాజరవుతారని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. ‘సచిన్, గావస్కర్, కపిల్, ద్రవిడ్, అనిల్ కుంబ్లే.. ఇలా ప్రతీ ఒక్కరు ఈ మ్యాచ్కు వస్తారు. టీ టైమ్లో ఇండియా మాజీ కెప్టెన్లతో కలిసి వీరంతా గ్రౌండ్ చుట్టూ తిరుగుతూ అభిమానులను ఉత్సాహపరుస్తారు. తొలి రోజు ఆట ముగిసిన తర్వాత సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఈ ప్రోగ్రామ్లో ఇరు జట్లు, మాజీ కెప్టెన్లు, బంగ్లాదేశ్ పీఎం షేక్ హసీనా, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అందరూ భాగమవుతారు. బంగ్లాదేశ్ ప్లే బ్యాక్ సింగర్ రునా లైలా, బెంగాల్ కంపోజర్ జీత్ గంగూలీతో మ్యూజికల్ ఫెర్ఫామెన్స్ కూడా ఉంటుంది’అని దాదా చెప్పాడు.
సపరేట్గా డే నైట్ స్టాట్స్-గావస్కర్ సూచన
కోల్కతా: పింక్ బాల్ క్రికెట్ కచ్చితంగా సక్సెస్ అవుతుందని ఇండియా కెప్టెన్ సునీల్ గావస్కర్ అన్నాడు. ‘గతంలో డే నైట్ క్రికెట్ (వైట్ బాల్తో) మొదలైనప్పుడు అది హిట్ అవుతుందో లేదో అని చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. కానీ తర్వాత దానికి ఎంత క్రేజ్ వచ్చిందో మనం చూశాం. అందువల్ల డే నైట్ టెస్టులు హిట్ కాబోవన్న అనుమానమే అవసరం లేదు. అయితే, పింక్ బాల్ టెస్ట్ క్రికెట్ స్టాట్స్ను సపరేట్గా లెక్కిస్తే బాగుటుందని నా అభిప్రాయం. లిమిటెడ్ ఓవర్లలో రెండు ఫార్మాట్లకు వేర్వేరు స్టాట్స్ ఉన్నాయి. రెడ్–బాల్కు అలానే చేస్తున్నప్పుడు పింక్ బాల్ లెక్కలు కూడా ప్రత్యేకంగా ఉంటే రాబోయే తరాలకు వాటి గురించి తెలుస్తుంద’ని అభిప్రాయపడ్డాడు.