
షాద్ నగర్లో వెటర్నరీ డాక్టర్పై జరిగిన అమానవీయ ఘటనపై జనంలో భావోద్వేగం కట్టలుతెంచుకుంది. తమ బిడ్డకే ఈ దారుణం జరిగిందా అన్నట్లుగా ప్రతి ఒక్కరూ రగిలిపోతున్నారు. కడుపుమండి రోడ్డెక్కారు. నిందితులపై కనికరం చూపొద్దంటూ ఆక్రోశంతో నినదిస్తున్నారు. ఆడబిడ్డలపై ఇంకెన్నాళ్లీ అకృత్యాలంటూ అగ్గిలా రగిలిపోతున్నారు. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ను వేలాదిగా జనం చుట్టుముట్టి… న్యాయం చేయాలంటూ గర్జిస్తున్నారు. ‘చూస్తూ ఉంటూ మానవ మృగాల ఆగడాలు ఆగవు.. షాద్నగర్ నుంచే వీళ్లను తుడిచిపెట్టడం సమాధి చేద్దాం. ఇప్పుడే ఇక్కడే ఉరి తీయాల్సిందే’ అంటూ నినాదాలు చేస్తున్నారు. ‘మాకు అప్పగిస్తారా? మీరు ఎన్కౌంటర్ చేస్తారా’ అని జనాలు ఆక్రోశంతో గర్జిస్తున్నారు. కోర్టులు.. జైళ్లు వద్దు.. రెండే నిమిషాల్లో వాళ్ల అంతం చూస్తాం.. షాద్ నగర్లోనే ప్రజా తీర్పు ఇస్తామంటూ జన దిగ్భంధం చేశారు.
షాద్ నగర్ సహా చుట్టుపక్కల గ్రామాల నుంచి పోలీస్ స్టేషన్ దగ్గరకు భారీగా జనాలు తరలివచ్చారు. వేలాదిగా ప్రజలు రావడంతో పోలీసులు మోహరించి వాళ్లను కట్టిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. జనాగ్రహం ముందు అవేం ఆగలేదు. వాటిని నెట్టుకుంటూ.. బారికేడ్లను ఎత్తేసి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు నిరసనకారులు. ప్రజా కోర్టులోనే ఆ మృగాలకు తగిన శాస్తి చేయాలంటూ నినాదాలు చూస్తుండడంతో పోలీసులు స్టేషన్కు తాళాలు వేశారు. పోలీసులు గంటల తరబడి అడ్డుకుంటుండడంతో జనాలు పోలీస్ డౌన్ డౌన్ అంటూ నినదాలు చేస్తున్నారు.
కచ్చితంగా నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చూస్తామని పదేపదే పోలీసులు మైక్లో అనౌన్స్ చేశారు. ఆవేశపడొద్దంటూ పిలుపునిచ్చారు. దయచేసి వెనక్కి వెళ్లండి.. చట్టాన్ని గౌరవించండి అని కోరారు.