గాంధీ కంటే రాఖీ సావంత్ గ్రేట్ అయితదా?

గాంధీ కంటే రాఖీ సావంత్ గ్రేట్ అయితదా?

లక్నో: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ హృదయ్ నారాయణ్ దీక్షిత్ వివాదంలో చిక్కుకున్నారు. జాతిపిత మహాత్మా గాంధీకి, బాలీవుడ్ నటి రాఖీ సావంత్‌‌కు మధ్య పోలిక తీసుకొస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీగా మారాయి. యూపీలోని ఉన్నావ్‌ జిల్లాలో బీజేపీ నిర్వహించిన ప్రబుద్ధ్ వర్గ్ సమ్మేళన్‌లో నారాయణ్ దీక్షిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏదో ఓ అంశం మీద పుస్తకాలు రాస్తేనో లేదా బుక్స్ చదివితేనో ఎవరూ మేధావులు అయిపోరని చెప్పారు. ఒకవేళ అలా భావించాల్సి వస్తే తాను దాదాపు 6 వేలకు పైగా పుస్తకాలు చదివానన్నారు.

‘పుస్తకాలు చదివితేనో, రాస్తేనో మేధావులు అయిపోరు. మహాత్మా గాంధీజీ పొట్టి దుస్తులు ధరించేవారు. ఆయన శరీరానికి ధోవతి మాత్రమే కట్టుకునేవారు. అయినా ఆయనను దేశం మొత్తం బాపూ అని పిలిచేది. పొట్టి బట్టలు వేసుకుంటే గొప్పవాళ్లు అయిపోతారని అనుకుంటే గాంధీ కంటే రాఖీ సావంతే గ్రేట్ కదా’ అని నారాయణ్ దీక్షిత్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది.