ఆకతాయిలను పరుగులు పెట్టించిన రామగుండం సీపీ

ఆకతాయిలను పరుగులు పెట్టించిన రామగుండం సీపీ

మంచిర్యాల: కరోనా లాక్ డౌన్.. కర్ఫ్యూ ఆంక్షలు పట్టించుకోకుండా రోడ్లపై తిరుగుతున్న ఆకతాయిలను రామగుండం పోలీసు కమిషనర్ వి.సత్యనారాయణ పరుగులు పెట్టించారు. ఎలాంటి కారణాలు లేకుండా బయట తిరుగుతున్న వారిని గుర్తించి లాఠీ ఝళిపించడంతో ఆకతాయిలు పరుగు లంకించుకున్నారు. స్వయంగా సీపీనే రంగంలోకి దిగడంతో బందోబస్తు డ్యూటీ పోలీసులు, స్థానిక ప్రజలు ఆశ్చర్యపోయారు.

మంగళవారం రాత్రి మంచిర్యాల పట్టణం లాక్ డౌన్ అమలు ను రామగుండం పోలీస్ కమీషనర్ వి.సత్యనారాయణ పర్యవేక్సిస్తూ వెళ్తున్నారు. నైట్ కర్ఫ్యూ సందర్భంగా అక్కడక్కడ రోడ్లపై నిలబడి ఉన్న వారిని సోషల్ డిస్టెన్స్ పాటించమని హెచ్చరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఎలాంటి కారణాలు లేకుండా బాధ్యతారాహిత్యంగా తిరుగుతున్న ఆకతాయిలను గుర్తించి లాఠీ చేత పట్టుకుని వెంటపడడంతో వారు పరుగులు పెట్టి సందులు, గొందుల్లో పడి తప్పించుకుని మాయమయ్యారు. సీపీ సత్యనారాయణ వెంట మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఏసీపీ అఖిల్ మహాజన్, సీఐ ముత్తి లింగయ్య, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజు, మహిళ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.