రేయనకా పగలనకా.. ఎండనకా వాననకా.. రైతన్న ఆరుగాలం చెమటోడ్చి కష్టం చేస్తేగానీ మనం తినడానికి ఇంత తిండి దొరుకుతోంది. కరోనా కష్టకాలంలో అన్నదాత పండించిన పంటను అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నాడు. ఈ సీజన్ లో మామిడి రైతులు పంట చేతికొచ్చినా కోసేందుకు కూలీలు దొరక్క.. ఏవో తంటాలు పడి కోసినా.. వాటిని మార్కెట్ కు తీసుకెళ్లి అమ్ముకోవడం పెద్ద కష్టంగా మారింది.
ఈ సమయంలో రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని రంగారెడ్డి జిల్లా కోహెడలో నూతనంగా పండ్ల మార్కెట్ ఏర్పాటు చేశారు అధికారులు. బుధవారం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మార్కెట్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెట్లోకి వెళ్లే సమయంలో మామిడికాయలు రాసులుగా పోసిఉండటంతో ఆయన తన షూ తీసి చేతపట్టుకుని నడుచుకుని వెళ్లారు. రైతన్న ఆరుగాలం కష్టాన్ని గౌరవించి.. మామిడి కాయలు నలిగిపోకుండా బూట్లు విప్పి చేత్తో పెట్టుకోవడంపై అక్కడున్న వారంతా హర్షం వ్యక్తం చేశారు. పోలీస్ ఆఫీసర్ గా ఉండి కూడా ఇంత సున్నితంగా ఆలోచించి అడుగులు వేయడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.