రైతాంగ సమస్యల పరిష్కారం కొరకు రేపు (శుక్రవారం) ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి. గత ప్రభుత్వాలు రైతుల మేలు జరగాలన్న లక్ష్యంతో మద్దతు ధర ప్రకటించి పంట మొత్తాన్ని కొనుగోలు చేసేవని తెలిపారు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత… అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించకుండా కొనుగోలు నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇప్పుడు తాజాగా చేతికి వచ్చిన మొక్కజొన్న పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో మద్దతు ధర రూ.1850 ఉన్నప్పటికీ.. దళారులు కేవలం రూ.1000 నుంచి రూ. 1300 లోపే కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. మొత్తంగా సగటున ఒక రైతు ఎకరా పంట మీద రూ. 15 వేల వరకూ నష్టపోతున్నాడని చెప్పారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి …రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయాలని రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో దాదాపుగా 3 లక్షల 50 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలకు నష్టం జరిగిందని తెలిపారు అన్వేష్ రెడ్డి. గత ప్రభుత్వాలు ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టం జరిగితే.. ఇన్ పుట్ సబ్సిడీని ఇచ్చేవని….తెలంగాణ వచ్చాక కేసీఆర్ ప్రభుత్వం 2015 నుంచి ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదన్నారు. కొన్ని సందర్భంలో కనీసం పంట నష్టం అంచనాలను కూడా ప్రభుత్వం చేయడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేలు ఇవ్వాలంటూ కిసాన్ కాంగ్రెస్ సెల్ డిమాండ్ చేస్తోందన్నారు అన్వేష్ రెడ్డి.