
- ఫుట్పాత్ గాళ్లు.. ఎట్ల పడితే అట్ల మాట్లాడుతున్నరు
- మేం కూడా బీజేపోళ్ల కంటే ఎక్కువే మాట్లాడగలం
- సీఎం మా నోరు కట్టేస్తున్నరు
- హైదరాబాద్లో రోహింగ్యాలుంటే చూపాలె
- నాలాల కబ్జాల పాపంలో మాకూ భాగస్వామ్యం ఉంది
హైదరాబాద్, వెలుగు: ‘‘ఎల్లిగాడు.. మల్లిగాడి మాట్లాడే మాటలకు మేం స్పందించం. ఫుట్పాత్ గాళ్లు.. ఎట్ల పడితే అట్ల మాట్లాడుతున్నరు. సీఎం మా నోర్లు కట్టేస్తున్నరు.. లేకుంటే మేం కూడా వాళ్లకంటే ఎక్కువే మాట్లాడుతం. బీజేపీ నాయకులు టూరిస్టుల్లా వచ్చి పోతున్నరు. కరీంనగర్లో ఉండే బండి సంజయ్కి హైదరాబాద్లో ఏం పని?’ అని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఫైరయ్యారు. ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి బుధవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ నాయకులు మదం పట్టి మాట్లాడుతున్నారని, పది శాతం ఓట్లున్న మైనారిటీ విషయంలో రాజకీయాలు చేస్తున్నారన్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని, అందరినీ అణిచివేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన తమకే ఇక్కడి విషయాలు తెలుస్తాయని, ఇతరులకు ఇక్కడేం పనని ప్రశ్నించారు. గత ప్రభుత్వాల హయాంలోనే నాలాలు కబ్జాకు గురయ్యాయని, ఆ పాపంలో తమకూ భాగస్వామ్యం ఉందని, ఆ పాపాలు ఇప్పుడు కడిగేసుకుంటున్నామన్నారు. వరద బాధితులందరికీ రూ.10 వేల చొప్పున సాయం చేశామని ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పారు. సాయం ఎవరికి అందలేదో చూపించాలన్నారు. తాము రెచ్చగొట్టడం, చింపడం మొదలు పెడితే కథ వేరేగా ఉంటుందని హెచ్చరించారు.