- డిగ్రీ లేకున్నా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటు
- ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలె
- సీఈవో శశాంక్ గోయల్కు మర్రి శశిధర్ రెడ్డి ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు:డిగ్రీ లేకున్నా ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు రిజిస్టర్ చేసుకుని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి దొంగ ఓటు వేశారని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై గురువారం బుద్ధ భవన్లో సీఈవో శశాంక్ గోయల్ను కలిసి ఫిర్యాదు చేశారు. తర్వాత గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఈ అంశంపై గవర్నర్కు, కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని శశిధర్ రెడ్డి తెలిపారు. స్వీడన్లో డిగ్రీ పూర్తి చేసినట్లు తప్పుడు సమాచారంతో ఎన్నికల టైమ్లో రోహిత్ రెడ్డి ఫేక్ అఫిడవిట్ దాఖలు చేశారని అన్నారు. తన వెబ్సైట్లో అమెరికాలో ఎంఎస్ చదివినట్లు పెట్టుకున్నారని తెలిపారు. దీనిపై సీఈవో శశాంక్ గోయల్కు ఫిర్యాదు చేయగా, కలెక్టర్ను విచారణకు ఆదేశిస్తామని చెప్పారని అన్నారు. ఫేక్ సర్టిఫికెట్ల ముఠాలో రోహిత్రెడ్డి హస్తం ఉందన్న అనుమానం కలుగుతోందని, డీజీపీ విచారణ జరిపించాలని శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు.
టీఎస్పీఎస్సీలో ఒక్క మెంబరేనా: మల్లు రవి
టీఎస్పీఎస్సీలో ఒకే మెంబర్ ఉండడం చూస్తేనే నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనపై సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోందని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. టీఎస్పీఎస్సీలో సభ్యులు, చైర్మన్ను అపాయింట్ చేసి, రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఘంటా చక్రపాణి రిటైర్ అయిన తర్వాత సాయిలు రెండో తాత్కాలిక చైర్మన్ అని, నిరుద్యోగ యువత జీవితాలు ఆధారపడి ఉన్న టీఎస్పీఎస్సీ విషయంలో ఇంత నిర్లక్ష్యం తగదని అన్నారు.