
- టిక్కెట్లివ్వకుండా డబ్బులు వసూలు
నకిరేకల్, వెలుగు: ఆర్టీసీ బస్సులో తాత్కాలిక కండక్టర్మరొకరిని ఏర్పాటు చేసుకొని ప్రయాణికులకు టిక్కెట్లు ఇవ్వకుండా డబ్బులు వసూలు చేస్తున్న సంఘటన శనివారం నకిరేకల్ లో జరిగింది.
సూర్యాపేట డిపోకు చెందిన బస్సులో తాత్కాలిక కండక్టర్ గా సూర్యాపేట మండలం చీకటిగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి చేరాడు. అతనికి తోడుకు ఖమ్మానికి చెందిన బంధువును నియమించుకున్నాడు. ఒకరు బస్సు ముందు, మరొకరు వెనక డోరు దగ్గర నిలబడి ప్రయాణికుల నుంచి డబ్బులు తీసుకుంటున్నారు.
టిమ్ ఉన్నా ఉపయోగించకుండా డబ్బులు వసూలు చేస్తుండడంతో ప్రయాణికులు టిక్కెట్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కండక్టర్లు దురుసుగా ప్రవర్తించడంతో కోపోద్రిక్తులైన ప్రయాణికులు బస్సును నకిరేకల్లో ఆపించి వారిని పోలీస్స్టేషన్లో అప్పగించారు.