
- బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్కు అనుకూలంగా వ్యవహరించినందుకు ఈసీ చర్యలు
- ముషీరాబాద్లో రూ.18 లక్షలు పంచిన ముఠా గోపాల్ కొడుకు జయసింహ, ఫ్రెండ్స్
- కేసు నుంచి జయసింహను తప్పించిన పోలీసులు
- సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు, చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ జహంగీర్ యాదవ్ సస్పెండ్
హైదరాబాద్, వెలుగు : ముషీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్కు అనుకూలంగా వ్యవహరించిన పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. హైదరాబాద్ సిటీ సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు, చిక్కడపల్లి ఏసీపీ ఎ.యాదగిరి, ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ జహంగీర్ యాదవ్ను విధుల నుంచి తొలగిస్తూ ఎలక్షన్ కమిషన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ముగ్గురి స్థానంలో ఇతర అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించాలని సీపీ సందీప్ శాండిల్యను ఆదేశించింది. ఉత్తర్వులు వెలువడిన వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీకి స్పష్టం చేసింది.
ముషీరాబాద్లో బీఆర్ఎస్ నోట్ల పంపిణీ
ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బులు పంచుతున్నారనే సమాచారంతో మంగళవారం రాత్రి ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ సోదాలు నిర్వహించింది. గాంధీనగర్ స్ట్రీట్ నంబర్ 1లోని సంతోష్ ఎలైట్ అపార్ట్మెంట్లో డబ్బులు పంచుతున్నారని తెలియడంతో అక్కడికి చేరుకుంది. అపార్ట్మెంట్లో పార్క్ చేసి ఉన్న ఏపీ 28 సీహెచ్ 6759 నంబర్ గల కారు వద్ద ఓటర్లు ఉండడం గమనించింది. వారి చేతుల్లో నోట్లు ఉండడం గుర్తించింది. ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ అధికారులు కారులో సెర్చ్ చేసి.. రూ.18 లక్షల క్యాష్, రెండు సెల్ఫోన్లు, చెక్బుక్ స్వాధీనం చేసుకొని ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ జహంగీర్ యాదవ్కు అప్పగించారు. 102 సీఆర్పీసీ కింద ఆయన కేసు నమోదు చేశారు.
ముఠా గోపాల్ కొడుకును తప్పించడంతో..!
డబ్బు దొరికిన అపార్ట్మెంట్లోనే ముషీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ కొడుకు జయసింహ నివాసం ఉంటున్నాడు. ఓటర్లకు అక్కడే డబ్బు పంపిణీ చేస్తున్నారు. ఈ కేసులో ముఠా గోపాల్ స్నేహితులు సంతోష్, ఆయన సోదరుడు సుధాకర్ను ముషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి కుమారుడు కావడంతో జయసింహపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ యాదిగిరి, ఇన్స్పెక్టర్ జహంగీర్ యాదవ్ కలిసి ముఠా గోపాల్కు చెందిన డబ్బు పంపిణీ వివరాలను బయటకు పొక్కకుండా చేశారు. ముఠా గోపాల్ కొడుకు జయసింహపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ వ్యవహారంపై ఎలక్షన్ కమిషన్కు సమాచారం అందింది.
దీంతో సీపీ సందీప్ శాండిల్య అంతర్గత విచారణ జరిపారు. గాంధీనగర్ సెక్టార్ ఎస్ఐ సహా మంగళవారం రాత్రి డ్యూటీలో ఉన్న పోలీస్ సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. పట్టుబడిన డబ్బు అభ్యర్థి ముఠాగోపాల్కు సంబంధించినదే అని నిర్ధారణకు వచ్చారు. ముఠా గోపాల్ కొడుకు జయసింహపై చర్యలు తీసుకోకుండా డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్ విధులను దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. దీనిపై నివేదికను ఈసీకి పంపారు. దీంతో ముగ్గురిపై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. వారి స్థానంలో సెంట్రల్ జోన్ డీసీపీగా శ్రీనివాస్, చిక్కడపల్లి ఏసీపీగా మదన్ మోహన్, ఇన్ చార్జ్సీఐగా వెంకట్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.