జనగామ జిల్లా: అరవై లక్షల సభ్యత్వాలు ఉన్న టీఆర్ఎస్ పార్టీ పై కొందరు ఇష్టం వచ్చినట్టు మొరుగుతున్నారని, కులాలను, మతాలను రెచ్చగొట్టే వాళ్లకు టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని టీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రచారంలో భాగంగా సోమవారం జనగామ జిల్లాలో మాట్లాడిన ఆయన.. మూడు జిల్లాలలో ఎక్కడికి వెళ్లినా విప్లవ వీరుల పేర్లు చెప్తారని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో జనగామ జిల్లాలో గ్రామగ్రామానికి ఒక చరిత్ర ఉందన్నారు. ఇలాంటి చరిత్ర గల గడ్డ తో బిజేపికి సబంధం లేదని అన్నారు.
తెలంగాణ వచ్చాక కాకతీయుల నాటి చెరువులు, కుంటలు మరమ్మత్తులు చేసి నీళ్లు నింపుకున్నామని, వచ్చే రెండు సంవత్సరాలలో ప్రతి ఎకరానికి నీళ్లు తెచ్చుకునేలా కృషి చేస్తున్నామని చెప్పారు రాజేశ్వర్ రెడ్డి. లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని.. నిరూపణకు మీరు సిద్దమా? అని బీజేపీ నాయకులని ప్రశ్నించారు. రైల్వే ప్లాట్ ఫామ్ పై చాయ్ అమ్మిన మోడి ఇప్పుడు ప్లాట్ ఫాం కూడా అమ్ముతడని ఎద్దేవా చేశారు.