
- గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ వ్యూహం
- ఎక్కువ సంఖ్యలోఓటర్ల నమోదుకు ప్రయత్నం
హైదరాబాద్, వెలుగు: త్వరలో జరగబోయే రెండు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్ఎస్ పార్టీ రూరల్ ఓటర్లపై ఫోకస్ పెట్టింది. సాధ్యమైనంత ఎక్కువ మందిని ఓటర్లుగా నమోదు చేయించేందుకు ప్రయత్నిస్తున్నది. ఇందుకోసం స్పెషల్గా నియమించిన మండల ఇన్చార్జులతో ఎప్పటికప్పుడు మంత్రి కేటీఆర్ ఫోన్లో మాట్లాడుతున్నారు. అర్బన్ ఏరియాలోని ఓటర్లు ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉంటారని భావిస్తున్న టీఆర్ఎస్ లీడర్లు.. అందుకు ఆల్టర్నేట్గా రూరల్ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రూరల్లోని గ్రాడ్యుయేట్స్ కుటుంబాలు రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, ఆసరా పథకాల్లో ఏదైనా ఒక స్కీమ్ ద్వారా లబ్దిపొంది ఉంటాయని, ఆ గ్రాడ్యుయేట్స్ ను నమ్ముకుంటే ఎన్నికల్లో ఫాయిదా ఉంటుందని లీడర్లు అంచనా వేసుకుంటున్నారు.
రెండు సీట్లలో కొత్తగా 2.60 లక్షల ఓటర్లు
నల్గొండ–వరంగల్–ఖమ్మం సెగ్మెంట్తోపాటు హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్ సెగ్మెంట్లో త్వరలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆరేండ్ల కింద జరిగిన ఈ ఎన్నికల్లో నల్గొండ–వరంగల్– ఖమ్మం సెగ్మెంట్లో 2.81 లక్షల మంది.. హైదరాబాద్–రంగారెడ్డి–మహమబూబ్నగర్ సెగ్మెంట్లో 2.96 లక్షల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఇప్పుడు రెండు స్థానాల్లో కలిపి కొత్తగా 2.60 లక్షల మంది ఓటర్లు యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో ‘నల్గొండ’ సెగ్మెంట్లో 1.10 లక్షల మంది, ‘హైదరాబాద్’ సెగ్మెంట్లో 1.50 లక్షల మంది ఉంటారు. రూరల్ ఓటర్లతోపాటు 2014 తర్వాత గ్రాడ్యుయేట్స్ పూర్తయిన వారిని నమ్ముకుంటేనే ఎన్నికల్లో లాభం ఉంటుందని, వారిలో ప్రభుత్వం పట్ల పెద్దగా వ్యతిరేకత ఉండదని టీఆర్ఎస్ లీడర్లు భావిస్తున్నారు. అలాంటివారిని గుర్తించి పెద్ద ఎత్తున ఓటర్లుగా నమోదు చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. అర్బన్ ప్రాంతంలోని గ్రాడ్యుయేట్స్ ఓటర్లు ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారని, ప్రధానంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు నెగెటివ్ ఓపీనియన్లో ఉన్నారని, వారిని ఎంత బుజ్జగించినా ప్రయోజనం ఉండదని టీఆర్ఎస్ లీడర్లు అంచనా వేసుకుంటున్నారు.
పెన్ డ్రైవ్, రూ. 5 లక్షలు
ఓటు నమోదు కోసం ప్రతి ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ ఒక పెన్ డ్రైవ్, రూ. 5 లక్షల ఫండ్ ను పంపించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. పెన్ డ్రైవ్ లో గ్రాడ్యుయేట్ల వివరాలు, ఫోన్ నంబర్లు, వారి కుటుంబ సభ్యులు ఇంతవరకు ప్రభుత్వం నుంచి అందుకున్న సంక్షేమ పథకాల వివరాలు పొందుపొర్చినట్లు తెలిసింది. మండలాల వారీగా ఓటరు నమోదు కోసం పనిచేస్తున్న కార్యకర్తల రోజువారీ ఖర్చు కోసం డబ్బులు పంపినట్టు సమాచారం.