
హైదరాబాద్, వెలుగు: ములుగు జిల్లాకు చెందిన లకావత్ సమ్ములాల్ నాయక్ ఎంఏ, బీఈడీ చదివాడు. సర్కార్ కొలువు కోసం ప్రయత్నిస్తూనే ప్రైవేట్ లెక్చరర్ గా చేసిండు. స్వరాష్ర్టం వస్తే మన జాబ్లు మనకొస్తాయని ఉద్యమంలో యాక్టీవ్గా పాల్గొని దెబ్బలు కూడా తిన్నడు. రాష్ర్టం వచ్చినంక కొలువు రాలే. ఏజ్ కూడా అయిపోయింది. సిటీకి వచ్చి చిన్న జాబ్లు చేస్తుంటే లాక్ డౌన్ లో అది కూడా పోయింది. ఇలా కష్టాలు పడుతూనే ‘నిరుద్యోగి@ఎంఏ బీఈడీ’ పేరుతో వనస్థలిపురంలో ఫాస్ట్ఫుడ్ సెంటర్ పెట్టుకుని జీవిస్తున్నాడు. తనలా పెద్ద చదువులు చదివి జాబ్ రాకచాలామంది నిరుద్యోగులు స్వ రాష్ట్రంలో ఇంకా అవమానాలపాలవుతున్నారని సమ్ములాల్ అంటున్నాడు. వారికి మార్గదర్శకంగా ఉండాలనే లక్ష్యంతో తన ఫాస్ట్ఫుడ్ సెంటర్లో అతడు మరో ఇద్దరు నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో చీకట్లు చూసిన నిరుద్యోగులకు సొంత రాష్ట్రంలోనూ అదే పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నిరుద్యోగులు తమ కాళ్లపై తాము నిలబడే విధంగానే ప్లాన్ చేసుకోవాలని సమ్ములాల్ చెబుతున్నాడు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్ముకొని ఉన్న జీవితాన్ని నిరుద్యోగి నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నాడు.