- కేంద్రంతో మీటింగ్లో తెలంగాణ స్పష్టీకరణ
- 9, 10 షెడ్యూల్ సంస్థలపై, కరెంట్
- బకాయిలపై ఏపీ కేసులు
- సింగరేణి విభజన కుదరదని స్పష్టం చేసిన కేంద్రం
- ఏపీ భవన్ విభజనకు కమిటీ
- ఇరురాష్ట్రాల సీఎస్లతో కేంద్ర హోంశాఖ మీటింగ్
- 9, 10 షెడ్యూల్ సంస్థలపై, కరెంట్ బకాయిలపై ఏపీ కేసులు
- సింగరేణి విభజన కుదరదని స్పష్టం చేసిన కేంద్రం
- ఏపీ భవన్ విభజనకు కమిటీ
- ఇరురాష్ట్రాల సీఎస్ లతో కేంద్ర హోంశాఖ మీటింగ్
హైదరాబాద్/న్యూఢిల్లీ, వెలుగు: విభజన సమస్యలపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రానంత వరకు విభజన అంత ఈజీగా పూర్తి చేయలేమని కేంద్ర హోం శాఖ ఆఫీసర్లు స్పష్టం చేశారు. తొమ్మిది, పదో షెడ్యూల్లో ఉన్న సంస్థల పూర్తి విభజనతో పాటు ఇతర ఆస్తుల పంపకం, విభజన అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎస్లతో బుధవారం కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్ భల్లా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో రెండు రాష్ట్రాలు తమ వాదనలు వినిపించాయి. త్వరగా విభజన పూర్తి చేయాలని తెలంగాణ కోరింది. అయితే ఒకరు యస్ అంటే.. ఇంకొకరు నో అంటుంటే సమస్యలు ఎలా కొలిక్కి వస్తాయని హోం సెక్రటరీ అన్నట్లు తెలిసింది. చట్ట ప్రకారం రెండు రాష్ట్రాలు విభజనకు సహకరించుకోవాలని చెప్పినట్లు సమాచారం. సింగరేణి, దానికి అనుబంధంగా ఉన్న ఆప్మెల్ (ఆంధ్రప్రదేశ్ హెవీ మెషినరీ ఇంజనీరింగ్ లిమిటెడ్) విభజనపై ఏపీ లేవనెత్తిన అంశాలను తెలంగాణ కొట్టిపారేసింది. వీటిని రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా చూడటానికి వీల్లేదని స్పష్టం చేసింది. చట్టంలోని సెక్షన్ 12-ఏ ప్రకారం కేంద్రం చేయాలని కోరింది.
ఏపీ కేసుల వల్లే..
కేంద్ర హోంశాఖ తమ వాదనతో ఏకీభవించినట్లు తెలంగాణ ఒక ప్రకటనలో పేర్కొంది. ఏపీ కొన్ని అంశాలపై హైకోర్టులో కేసు వేసినందున వాటిని విత్ డ్రా చేసుకుంటే కానీ.. విభజన ముందుకు సాగదని తెలిపింది. ఇందులో తొమ్మిదో షెడ్యూల్లో ఏపీ వేసిన రెండు కేసుల కారణంగా విభజన అసంపూర్తిగా మిగిలిపోయిందని పేర్కొంది. ఆ కేసులు విత్ డ్రా చేసుకుంటే తప్ప విభజన ముందుకు సాగదని స్పష్టం చేసింది. డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (దిల్)కు కేటాయించిన 5 వేల ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుందని, అయితే ఆ జీవోపై ఏపీ ప్రభుత్వం రిట్ పిటిషన్ వేసి స్టే ఆర్డర్ పొందినట్లు పేర్కొన్నారు. ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ విషయంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు కార్పొరేషన్కు కేటాయించిన 250 ఎకరాలను తిరిగి తీసుకోవాలనుకుంటే.. దానిని కూడా వ్యతిరేకిస్తూ ఏపీ సర్కారు కోర్టులో స్టే తెచ్చుకుందని పేర్కొన్నారు. ఇక పదో షెడ్యూల్లో ఉన్న ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కు సుప్రీం కోర్టు జారీ చేసిన ఆర్డర్స్ ప్రకారం 2017లో కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులనే మిగిలిన అన్ని సంస్థలకు వర్తింపజేయాలన్నారు. దీనిపై ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిందని, అది విత్ డ్రా చేసుకుంటే తప్ప పదో షెడ్యూల్ సంస్థల విభజన ముందుకు పడదని పేర్కొంది. ఇక ఢిల్లీలో ఆంధ్రా భవన్ కేటాయింపులు చేపట్టేందుకు శ్రీరామకృష్ణారావు, ఎస్పీతో కూడిన కమిటీ వేయాలని తెలంగాణ సూచించగా, దీనికి ఏపీ అంగీకరించింది.
ఏపీ నుంచే బకాయిలు రావాలె
పవర్ బిల్లుల కేసును కోర్టు నుంచి ఏపీ విత్ డ్రా చేసుకోవాలని తెలంగాణ కోరింది. ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన పవర్యుటిలిటీస్ రూ.12,111 కోట్లు కాగా, టీఎస్ జెన్కో చెల్లించాల్సిన బకాయిలు రూ.3422 కోట్లుగా ఉందని పేర్కొంది. అయితే సీలేరు హైడల్ పవర్ ప్రాజెక్ట్ నుంచి తెలంగాణకు తక్కువ ధరకు అందలేదని తెలిపింది. ఫలితంగా తెలంగాణ డిస్కంలు ఎక్కువ ధరలకు విద్యుత్ను ఇతర ప్రాంతాల నుంచి కొనాల్సి వచ్చిందని పేర్కొంది. విద్యుత్ రంగ సమస్యల పరిష్కారానికి నీరజా మాథుర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఇప్పటికీ రిపోర్ట్ ఇవ్వలేదన్నారు. ముందు ఏపీ కేసు విత్ డ్రా చేసుకుంటే లెక్కలు సెటిల్ అవుతాయని తెలిపారు. ఎఫ్డీ ల విభజనను పరిశీలించేందుకు ఇద్దరు (2) నోడల్ అధికారులను నియమించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి సూచించారు.
బ్యాంకు డిపాజిట్లు చెల్లించలే
ఏపీ నుంచి రావాల్సిన సొమ్మును వెంటనే చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ల విషయంలో రూ.495 కోట్లు ఏడేండ్లుగా పెండింగ్లో ఉందన్నారు. హైకోర్టు, రాజ్ భవన్, ఇతర ఉమ్మడి సంస్థలపై రూ.315 కోట్ల వరకు ఖర్చు చేసిన సొమ్ముపై ఏపీ చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయన్నారు. నిర్మాణంలో ఉన్న భవనాల వాటా, రూ.456 కోట్ల సంక్షేమ నిధి, ఇంకో రూ.208 కోట్లు ఏపీ చెల్లించలేదన్నారు. సమావేశంలో సీఎస్తో పాటు సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ రావు, ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణా రావు, ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.