నిన్నటి దాంక నమాజ్కే ప్రవేశం లేని ఆడోళ్ల కోసమని ఒక మసీదుల వెల్నెస్ సెంటర్ స్టార్ట్ చేసిన్రు! మత బోదనలే గాదు, మతాన్ని విశ్వసించేటోళ్ల హెల్త్ గూడా కాపాడటం మా అభి‘మతం’ అని చెబుతున్న ఈ మసీదు ఏడనో లేదు. మన హైదరాబాద్ సిటీలనే ఉంది! ఆ డోళ్ల కోసం స్టార్ట్ చేసిన వెల్నెస్ సెంటర్ రాజేంద్ర నగర్లో ఉన్న ‘మజీద్–ఎ–ముస్తఫ’ల ఉన్నది. హైదరాబాద్ సెంటర్గ పనిచేసే హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్… ఎడ్యుకేషన్, ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం పనిచేసే అమెరికా ఎన్జీవో ‘సపోర్ట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ (సీడ్)’ కలిసి ఈ వెల్నెస్ సెంటర్ని స్టార్ట్ చేశినయ్. చుట్టుపక్కల ఉన్న బస్తీల్లో ఉండే పేద మహిళలు ఉపయోగించుకునేలా ఈ వెల్నెస్ సెంటర్ని నిర్వహిస్తామని ఆర్గనైజర్స్ చెప్తున్నరు.
ఈ వెల్నెస్ సెంటర్ల జిమ్ కూడా ఉన్నది. బస్తీ ఆడోళ్లని ట్రైన్ చేయనీకి ఫిట్నెస్ ఎక్స్పర్ట్ ట్రైనర్ గూడ ఉన్నరు. ఆమె ప్రతి రోజూ రెండు బ్యాచ్లకు వర్కవుట్స్ ఎట్ల చేయాల్నో చెబుతదట. ‘హెల్తీగ ఉన్నరో? లేదో? చెక్ చేసుకోవాల్నంటే వెల్నెస్ సెంటర్కి రండ్రి’ డాక్టర్ కన్సల్టెన్సీ ఫ్రీగ ఇప్పిస్తమని బస్తీ ఆడోళ్లకు వెల్కమ్ చెప్తున్నరు. జనం ఆరోగ్యంగా ఉన్నరా? లేదా? ఏం ఇబ్బందులున్నయ్? ఎందుకొచ్చినయ్? తెలుసుకోని కౌన్సెలింగ్ చేయనీకి ఇందులో ఒక లేడీ డాక్టర్ గూడ ఉంది. ఇట్ల మజీద్ని దవాఖాన లెక్క మార్చినరు. ఈ దవాఖానల కౌన్సెలింగ్ చేసే డాక్టర్… రోగం రాకముందలే సింప్టమ్స్ని పసిగట్టి అలర్ట్ చేస్తది. పేదోళ్లకు ఇంతకంటే పెద్ద సాయం ఏముంటది? ప్రాబ్లమ్ ఉందని తెలిస్తే వాళ్లు యాడికి పోవాలె? ఎవర్ని కలవాల్నో కూడా చెప్పి, అవసరమైన సాయం జేస్తరట.
క్లినిక్ కమ్ జిమ్
బస్తీల్ల మస్త్ జనం ఉంటరు. గల్లీలే కాదు ఇళ్లు గూడా ఇరుకే. ఇల్లు పక్కన ఇల్లు ఉండే ఈ బస్తీల్లో ఒకలు మంచం పడితె వారంల బస్తీ అంతా సుస్తి జేస్తది. ఇసుంటి చోట అందరూ ఖుషీగా ఉండాల్నంటె ఫిట్నెస్ పెంచుకొనుడే ఆప్షన్. ఆమ్దాని పెరగకున్న ఫిట్నెస్ అన్నా పెంచుకుంటే కోవిడ్ టైమ్ల గట్టెక్కుతం అని అనుకుంటే సరిపోలే. జిమ్లకు, వెల్నెస్ సెంటర్స్కి పోవాల్నంటే మస్త్ పైసలు ఉండాలె. మరి పైసల్లేనోళ్ల సంగతి ఏంది? వాళ్ల కోసమే మసీద్ల హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ మసీద్ల వెల్నెస్ సెంటర్ని స్టార్ట్ చేసింది.
బెటర్ ప్రివెన్షన్
బస్తీల్ల రోగాలెక్కువ. ఎందుకిట్లయితందని ఇంతకుముందెన్నోసార్లు సర్వే చేసిన్రు. ఆ సర్వేల్ల ఒక సర్వే ఏం తేల్చిందంటే.. 52 శాతం మంది ఆడోళ్లు కార్డియో మెటబాలిక్ సిండ్రోమ్ (గుండె కండరాలు, గుండెలోని వాల్వ్స్కి సంబంధించిన)లోపంతో ఇబ్బంది పడ్తున్నరు. పిడికిలి మించని హృదయంలో కడలిని మించిన విషాదం గిది. ఒక సర్వేల 25 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న ఆడోళ్లల 30 శాతం మంది పీసీఓడీ (పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్)తో ఇబ్బందులు పడ్తున్నరని తేలింది. 12 శాతం మంది డయాబెటిస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ల ఏదో ఒకదానితో ఉన్నరు. బాడీ మాస్ ఇండెక్స్ కూడా సరిగ లేకుండె. ఈ బాధలు లేకుండ చేయాల్నంటె అందరిల హెల్త్ అవేర్నెస్ తీస్కరావాలనుకున్నరు. గుండెతో పాటు కిడ్నీ, లివర్, కంటి చూపు మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నమని చెప్తున్నరు.
బస్తీ దవాఖాన
కోవిడ్ టైమ్ దవాఖానకు పోవల్నంటె ఎంత కష్టంగుండెనొ. చిన్న చిన్న దవాఖానలన్నీ మూతపడ్డయ్. పెద్ద దవాఖానలకు పోదమంటే పేదోళ్లకు కష్టంగుండె. ఆ టైమ్లో ఈ వెల్నెస్ సెంటర్ల ‘రుబియా క్లినిక్’ పేరుతో దవాఖాన నడిపిన్రు. కోవిడ్ బారిన పడకుండా సేఫ్టీ కోసం ప్లాస్టిక్ కర్టెన్స్, ఫేస్ షీల్డ్ మాస్కులు పెట్టుకుని ఎంత మంది వచ్చినా చెకప్ చేసి పంపిన్రు. రాజేంద్ర నగర్ మండలం పరిధిలో ఉన్న 31 బస్తీ జనాలకు ఈ క్లినిక్ హెల్ప్చేసింది.