
హైదరాబాద్ యువకుడు రికార్డు సృష్టించాడు. కేవలం పది నెలల కాలంలో ఏడు ఖండాల్లోని అత్యంత ఎత్తైన పర్వతాలలో నాలుగింటిని ఎక్కి వరల్డ్ రికార్డుకెక్కాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తక్కెళ్లపల్లి తండాకు చెందిన తుకారాం చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టం. దాంతో స్కూల్ డేస్లోనే కబడ్డీ, జిమ్నాస్టిక్స్ ఆటలలో జాతీయస్థాయికి ఎదిగాడు. ఆ తర్వాత కాలేజీ రోజులలో ఎన్సీసీ శిక్షణలో భాగంగా ఉత్తర కాశీలో మౌంట్ ఇంజనీరింగ్ చేస్తూ మూడు బంగారు పతకాలు సాధించాడు. అప్పటి నుంచి పర్వతారోహణ మీదే దృష్టి పెట్టాడు.
అయితే తాను చేసే పర్వతారోహణ.. కేవలం రికార్డులు సాధించడానికే కాకుండా.. సమాజానికి కూడా ఉపయోగపడాలనుకున్నాడు. అందుకే ఏ పర్వతమెక్కినా అక్కడి నుంచి ఒక సందేశం ఇస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భాన్ని సెలబ్రేట్ చేస్తూ.. హిమాచల్ప్రదేశ్లోని నర్బు పర్వతం ఎక్కి.. బతుకమ్మ గురించి తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర పతాకాన్ని ఎగరవేశాడు. నేతన్నలు నేసే ఖాదీ బట్టలను రోజువారీగా వాడాలని పిలుపునిస్తూ గంగోత్రిలోని మౌంట్ రుడుగారియా పర్వతారోహణను పూర్తి చేశాడు. దేశభక్తిని చాటి చెబుతూ లడ్డాఖ్లోని మౌంట్ స్టాకన్ పర్వతంపై 19 అడుగుల జాతీయ పతాకాన్ని ఎగరవేశాడు. పంచభూతాలను కాపాడుకోవాలంటూ సందేశమిస్తూ అత్యంత క్లిష్టమైన ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించాడు. హెల్మెట్ మన కోసం కాదు.. మన కుటుంబం కోసం అనే సందేశంతో ఆఫ్రికాలోని కిలిమంజారో ఎక్కాడు. డ్రగ్స్ నిషేధించాలంటూ రష్యాలోని ఎల్బ్రస్ పర్వతారోహణ పూర్తి చేశాడు. దేశ సర్వసత్తాక సార్వభౌమత్వానికి సూచికగా జనవరి 26న సౌత్ అమెరికాలోని మౌంట్ అకాంజాగువా అధిరోహించాడు. ఆస్ట్రేలియాలో బుష్ ఫైర్స్ కారణంగా ఏర్పడుతున్న సమస్యలు, బాధితుల కోసం ఆస్ట్రేలియాలోని కొజియాస్కో పర్వతాన్ని ఎక్కాడు.
ఇందుకు గాను రాష్ట్రపతి చేతుల మీదుగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డును అందుకున్నాడు. తెలంగాణలో బెస్ట్ స్పోర్ట్స్మెన్షిప్ అవార్డును రెండుసార్లు అందుకున్నాడు. జమ్మూ, కశ్మీర్ ప్రభుత్వం నుంచి తొలి దక్షిణాది బెస్ట్ ఇన్ టెక్నిక్ అవార్డ్ అందుకున్నాడు. దిల్సుఖ్నగర్లోని ఓ కళాశాలలో పొలిటికల్ సైన్స్లో పోస్టుగాడ్యుయేట్ చేస్తున్న తుకారాం.. వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. తుకారం తాజాగా కేంద్రమంత్రిని కలసి అభినందనలు కూడా అందుకున్నాడు.
For More News..