- నేషనల్ విమెన్ కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ
- విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ పెండ్లిండ్లపై సదస్సు
హైదరాబాద్, వెలుగు: ఎన్ఆర్ఐ పెండ్లి సంబంధాలపై తల్లిదండ్రులు, యువతులు జాగ్రత్తగా ఉండాలని నేషనల్ విమెన్ కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ అన్నారు. అవగాహన లేక చాలా మంది యువతులు మోసపోతున్నారని చెప్పారు. శుక్రవారం బేగంపేట టూరిజం ప్లాజా హోటల్లో నేషనల్ విమెన్ కమిషన్, స్టేట్ విమెన్ సేఫ్టీ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ పెండ్లిండ్లు, బాధిత మహిళలకు న్యాయ సాయం, చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా ఎన్ఆర్ఐ మోసాల కేసులు పెరిగిపోతున్నాయని రేఖాశర్మ చెప్పారు. పంజాబ్, హర్యానా, ఢిల్లీ తర్వాత ఏపీ, తెలంగాణలో ఎక్కువ కేసులు వస్తున్నాయన్నారు. నేషనల్ విమెన్ కమిషన్కు 2009 నుంచి 2021 నవంబర్ వరకు 5,858 ఫిర్యాదులు వచ్చాయన్నారు. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న ఎన్ఆర్ఐలు అంటే యువతులు, వారి తల్లిదండ్రులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారన్నారు. అబ్బాయి గురించి తెలుసుకోకుండా పెండ్లిండ్లు చేసి, మోసపోతున్నారన్నారు. ఎన్ఆర్ఐ మోసాలకు అడ్డుకట్ట వేయాలంటే స్కూళ్లు, కాలేజీలు, ఐటీ ఉద్యోగుల్లో అవగాహన కలిగించాలని ప్రభుత్వాన్ని కోరారు. సదస్సులో రాష్ట్ర విమెన్ కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, లీగల్ సర్విసెస్ అథారిటీ తదితరులు పాల్గొన్నారు.
పెండ్లి చేసుకొని ఇక్కడే వదిలి వెళ్తున్రు
ఎన్ఆర్ఐ మోసాలకు సంబంధించి రాష్ట్ర మహిళా కమిషన్కు 2018 నుంచి ఇప్పటి వరకు 15 ఫిర్యాదులు వచ్చాయి. ఎన్ఆర్ఐలు పెండ్లి చేసుకొని భార్యలను ఇక్కడే వదిలి వెళ్తున్నారు. కట్నం కోసం వేధిస్తున్నారు. ఈ కేసుల పరిష్కరానికి చర్యలు తీసుకుంటున్నాం.
- సునీతా లక్ష్మారెడ్డి,స్టేట్ విమెన్ సేఫ్టీ వింగ్, చైర్పర్సన్
728 కేసులు వచ్చాయ్
రాష్ట్రవ్యాప్తంగా 2018 నుంచి 2021 -నవంబర్ వరకు 728 ఎన్ఆర్ఐ వివాహాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. ఎన్ఆర్ఐ సెల్ ద్వారా 2019 నుంచి నవంబర్ వరకు 239 కేసులు రిజిస్టర్ చేశాం. ఇందులో 42 కేసుల పరిష్కరించాం. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, సౌదీ అరేబియా, కెనడా దేశాలకు సంబంధించిన కేసులే ఎక్కువగా ఉన్నాయి.
- స్వాతి లక్రా, అడిషనల్ డీజీ, విమెన్ సేఫ్టీ వింగ్