యాదాద్రి-భువనగిరి : భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పట్టణాల్లో ప్రతి 1000 మందికి ఒక టాయిలెట్ చొప్పున 142 మున్సిపాలిటీల్లో 16,338 టాయిలెట్స్ నూతనంగా నిర్మించామని మంత్రి కేటీఆర్ చెప్పారు. శుక్రవారం నాడు జిల్లాలోని భువనగిరిలోని డంపింగ్ యార్డ్లో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే 5-7 ఏళ్లలో పట్టణాల్లో 53%,గ్రామాల్లో 47% మంది నివాసముండనున్నారని తెలిపారు. ఇందుకు తగ్గట్టుగా మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. చట్టాన్ని ప్రజల చేతికి బ్రహ్మాస్త్రంలా ఇచ్చింది ఒకే ఒక్క తెలంగాణ ప్రభుత్వమేనని ఆయన తెలిపారు.
గాంధీ జయంతి సందర్భంగా అందరూ స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇచ్చి, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. గాంధీజీ స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి.. వారికి నిజమైన నివాళి అందించేందుకు ఈ రోజును స్వచ్ఛత దినోత్సవంగా పాటిస్తున్నామని తెలిపారు. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి కలిసి శంకుస్థాపన చేశారు.